టీ20 వరల్డ్కప్-2026 ట్రోఫీని భారత జట్టు సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఫైనల్లో 96 పరుగుల తేడాతో న్యూజిలాండ్ను చిత్తు చేసిన టీమిండియా.. మూడోసారి పొట్టి ఫార్మాట్లో విశ్వవిజేతగా నిలిచి చరిత్ర సృష్టించింది.
ఈ నేపథ్యంలో భారత జట్టుపై ఇంగ్లండ్ మాజీ పేసర్ స్టీవ్ హార్మిసన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. భారత్ టైటిల్ గెలిచినప్పటికీ, టోర్నీలో అత్యుత్తమ జట్టు దక్షిణాఫ్రికానేనని అతడు అభిప్రాయపడ్డాడు. ఈ టోర్నీ అసాంతం భారత్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచినప్పటికి, సూపర్-8లో మాత్రం సౌతాఫ్రికా చేతిలో 76 పరుగుల తేడాతో ఘోర ఓటమిని చవిచూసింది. అదే విషయాన్ని స్టీవ్ హార్మిసన్ ప్రస్తావించాడు.
"న్యూజిలాండ్తో జరిగిన ఫైనల్ మ్యాచ్లో అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచారు. వారు నెలకొల్పిన భాగస్వామ్యమే భారత్ను విజేతగా నిలిపింది. ఫ్లాట్ పిచ్లపై జస్ప్రీత్ బుమ్రా ప్రదర్శనే ఇతర జట్లకు, భారత్కు మధ్య తేడా చూపించింది. ఈ టోర్నీలో భారత్ అత్యుత్తమ జట్టు అని నేను అనుకోవడం లేదు.
నా దృష్టిలో దక్షిణాఫ్రికానే అత్యుత్తమ జట్టు. టీమిండియా కేవలం 'బెస్ట్ మొమెంట్ టీమ్' మాత్రమే. మ్యాచ్ మలుపు తిరిగే కీలక సమయాల్లో వారు అద్భుతంగా రాణించి విజేతగా నిలిచారు. గ్రూపు స్టేజిలో భారత్ అంతగా ఆకట్టుకోలేకపోయారు. వెస్టిండీస్తో జరిగిన వర్చువల్ క్వార్టర్ ఫైనల్లోనూ టీమిండియా ఇబ్బందులను ఎదుర్కొంది.
కొంతమంది మ్యాచ్ విన్నర్ల కారణంగా ఓటమి నుంచి భారత్ గట్టెక్కింది. వారే భారత్కు బలం. ఇక టోర్నీ ఆద్యంతం అజేయంగా నిలిచిన దక్షిణాఫ్రికా, సెమీఫైనల్లో ఫిన్ అలెన్ విధ్వంసం వల్లే ఓడిపోయింది. సూపర్-8లో భారత్ను సైతం సౌతాఫ్రికా ఓడించందని" టాక్స్పోర్ట్ క్రికెట్ యూట్యూబ్ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో హార్మిసన్ పేర్కొన్నాడు.
చదవండి: T20 WC 2026: 'గంభీర్ చాలా పెద్ద తప్పు చేశాడు'


