
బతూమి (జార్జియా): మహిళల ప్రపంచకప్ చెస్ నాకౌట్ టోర్నమెంట్లో భారత గ్రాండ్మాస్టర్, ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణి కోనేరు హంపి, జూనియర్ ప్రపంచ చాంపియన్ దివ్య దేశ్ముఖ్ (మహారాష్ట్ర) నాలుగో రౌండ్లోకి దూసుకెళ్లారు. మూడో రౌండ్లో హంపి 1.5–0.5తో కులోన్ క్లౌడియా (పోలాండ్)పై, దివ్య 1.5–0.5తో టియోడోరా ఇంజాక్ (సెర్బియా)పై విజయం సాధించారు. ఆదివారం జరిగిన మూడో రౌండ్ రెండో గేమ్లో హంపి 44 ఎత్తుల్లో క్లౌడియాను ఓడించింది.
ఇంజాక్తో జరిగిన రెండో గేమ్ను దివ్య 30 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకుంది. శనివారం జరిగిన మూడో రౌండ్ తొలి గేమ్ను హంపి 102 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకోగా... ఇంజాక్తో జరిగిన గేమ్లో దివ్య 39 ఎత్తుల్లో గెలిచింది. మూడో రౌండ్లోని రెండు గేమ్లు ముగిశాక భారత్కే చెందిన ద్రోణవల్లి హారిక–స్టావ్రూలా (గ్రీస్), వంతిక అగర్వాల్–కాటరీనా లాగ్నో (రష్యా), వైశాలి–కరిస్సా యిప్ (అమెరికా) 1–1తో సమంగా నిలిచారు. దాంతో ఈరోజు టైబ్రేక్ గేమ్లు నిర్వహించి విజేతలను నిర్ణయిస్తారు.