పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు ఘోర అవమానం ఎదురైంది. దాదాపు పదకొండేళ్ల తర్వాత తొలిసారి బంగ్లాదేశ్కు వన్డే సిరీస్ను కోల్పోయింది. బంగ్లా పర్యటనలో భాగంగా మూడో వన్డేలో ఓడి ఈ పరాభవాన్ని మూటగట్టుకుంది.
షాహిన్ ఆఫ్రిది కెప్టెన్సీలో ఈ మూడు మ్యాచ్లు ఆడిన పాకిస్తాన్.. తొలి మ్యాచ్లో బంగ్లాదేశ్ చేతిలో ఓడినా.. రెండో వన్డేలో గెలిచింది. ఇక తాడోపేడో తేల్చుకోవాల్సిన మూడో వన్డేలో మాత్రం 11 పరుగుల తేడాతో ఓటమిపాలై సిరీస్ను చేజార్చుకుంది. ఈ నేపథ్యంలో పాక్ జట్టు ఆట తీరుపై ఆ దేశ మాజీ క్రికెటర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఎవరు ఎంపిక చేశారు?
ఈ క్రమంలో పాకిస్తాన్ మాజీ క్రికెటర్ బసిత్ అలీ హెడ్కోచ్ మైక్ హెసన్పై తీవ్ర స్థాయిలో మండిపడ్డాడు. ‘‘ఈ పదిహేను మంది సభ్యులతో కూడిన జట్టును ఎవరు ఎంపిక చేశారు? అన్నింటిలోనూ అతి జోక్యం అవసరమా? ఇదేమైనా అతడి అంకుల్స్ జట్టా?’’ అంటూ ఫైర్ అయ్యాడు.
పాకిస్తాన్ క్రికెట్ను నాశనం చేయడంలో...
ఇక చీఫ్ సెలక్టర్ ఆకిబ్ జావేద్ గురించి ప్రస్తావిస్తూ.. ‘‘పాకిస్తాన్ క్రికెట్ను నాశనం చేయడంలో ఆకిబ్ జావేద్ పాత్ర కూడా ఉంది. మైక్ హసన్కు తన సెలక్షన్ అధికారాలను కట్టబెట్టిందే అతడు. హెడ్కోచ్ అయినప్పటికీ.. సెలక్టర్ల పనిని తానే చేస్తున్నాడు. అతడే జట్టు ఎంపిక చేస్తున్నాడు. దీనికి కారణం ఎవరు?’’ అని బసిత్ అలీ ఆగ్రహం వ్యక్తం చేశాడు.
మానసికంగానే అతడు అన్ఫిట్
అదే విధంగా.. బాబర్ ఆజంను బంగ్లాదేశ్ పర్యటన నుంచి తప్పించడంపై ఆకిబ్ జావేద్ చేసిన వ్యాఖ్యలపైనా బసిత్ అలీ స్పందించాడు. ఆకిబ్ చెప్పినట్లు బాబర్కు ఎలాంటి గాయమూ కాలేదని పేర్కొన్నాడు.
‘‘బాబర్ ఆజం శారీరకంగా ఫిట్గానే ఉన్నాడు. మానసికంగానే అతడు అన్ఫిట్’’ అంటూ బసిత్ అలీ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. కాగా బాబర్ ఆజం గత కొంతకాలంగా ఫామ్లేమితో విమర్శల పాలవుతున్న విషయం తెలిసిందే.
టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో విఫలం
ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్తో వన్డేల నుంచి సెలక్టర్లు అతడిని తప్పించినట్లు వార్తలు రాగా.. ఆకిబ్ జావేద్ మాత్రం ఫిట్గా లేనందువల్లే సెలక్ట్ చేయలేదని చెప్పడం గమనార్హం. ఇదిలా ఉంటే.. టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో పాకిస్తాన్ విఫలమైన సంగతి తెలిసిందే.
అయితే, గత వరల్డ్కప్లో సూపర్-8 కూడా చేరుకుండానే నిష్క్రమించిన పాక్.. ఈసారి సూపర్-8కు చేరుకున్నా.. సెమీస్ చేరకుండానే ఇంటిబాట పట్టింది. ఈ టోర్నీలో బాబర్ ఆజం మొత్తంగా 91 పరుగులు మాత్రమే చేయడం గమనార్హం.


