breaking news
World Cup Chess Championship
-
హంపి, దివ్య తొలి గేమ్ డ్రా
బతూమి (జార్జియా): భారత్కు ఖాయమైన వరల్డ్కప్ టైటిల్ను తమ పరం చేసుకునేందుకు తెలుగు తేజం కోనేరు హంపి, దివ్య దేశ్ముఖ్ తొలి గేమ్లో దీటుగా ఎత్తుకు పైఎత్తులు వేశారు. దాంతో ఈ పోరు సమంగా ముగిసింది. ‘ఫిడే’ మహిళల ప్రపంచకప్ నాకౌట్ చెస్ టోర్నమెంట్లో శనివారం జరిగిన తొలి గేమ్లో 41 ఎత్తుల తర్వాత ఫలితం వచ్చే అవకాశం లేకపోవడంతో ఇద్దరూ ‘డ్రా’కు మొగ్గు చూపారు. ఈ పోరులో నల్ల పావులతో బరిలోకి దిగిన హంపికి ఓపెనింగ్ ఎత్తుగడలేవీ కలిసి రాలేదు. గేమ్ను మొదలుపెట్టిన వ్యూహం, వేసిన ఎత్తులు ఆంధ్రప్రదేశ్ గ్రాండ్మాస్టర్ను కాస్త ఇరకాటంలో పెట్టాయి. దీంతో తెల్ల పావులతో ఆడుతున్న దివ్యకు అవి అదనపు బలాన్నిచ్చేలా చేశాయి. దీంతో 14వ ఎత్తు వరకు గేమ్ దివ్య నియంత్రణలోనే ఉంది. అయితే ఈ దశలో తేరుకున్న హంపి జాగ్రత్త పడింది. ఎత్తుగడ మార్చి పైఎత్తులతో గేమ్పై పట్టు పెంచుకుంది. దీంతో అక్కడి నుంచి ఆట పోటాపోటీగా సాగడంతో చివరకు డ్రా తప్పలేదు. ఇంటర్నేషనల్ మాస్టర్, 19 ఏళ్ల దివ్య ఒక దశలో వెటరన్ గ్రాండ్మాస్టర్కు చెమటలు పట్టించింది. ఈ టోర్నీలో ఇప్పటి వరకు ప్రయత్నించని డి4 గడి నుంచి ఓపెనింగ్ చేసిన దివ్య ఎత్తులు, చకచకా పావులు కదుపుతున్న తీరు ఆమె ఫైనల్ కోసం బాగా సన్నద్ధమైందనిపించింది. హంపిని ఒత్తిడికి గురి చేసేందుకు ఎత్తులకు పదునుపెట్టే క్రమంలో చాలా సమయం తీసుకుంది. మరో వైపు అనుభవజు్ఞరాలైన హంపి ఆరంభంలో ప్రత్యర్థి చురుకైన ఎత్తులకు ఏమాత్రం కంగారు పడకుండా తన గేమ్ ప్లాన్ను అమలు చేసింది. ఈ క్రమంలో ఆరంభంలో కాస్త ఇబ్బందులు ఎదురైనప్పటికీ ఒత్తిడికి గురి కాలేదు. గేమ్ మధ్యలో పట్టు చిక్కించుకున్న హంపి... దివ్య జోరును అడ్డుకుంది. ఈ సమయంలో దివ్య గెలుస్తానన్న ధీమాతో డ్రాకు అంగీకరించలేదు. చివరకు గేమ్ సాగే కొద్దీ ఫలితంపై ఆశలు లేకపోవడంతో దాదాపు మూడు గంటలపాటు జరిగిన ఈ గేమ్ 41వ ఎత్తుల్లో డ్రా అయ్యింది. ఫైనల్లో భాగంగా నేడు రెండో గేమ్ జరుగుతుంది. ఇందులో గెలిచినవారు ప్రపంచ విజేతగా నిలుస్తారు. ఒకవేళ ఫలితం రాకపోతే రేపు టైబ్రేక్ ద్వారా చాంపియన్ను తేలుస్తారు. -
నాలుగో రౌండ్లో హంపి, దివ్య
బతూమి (జార్జియా): మహిళల ప్రపంచకప్ చెస్ నాకౌట్ టోర్నమెంట్లో భారత గ్రాండ్మాస్టర్, ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణి కోనేరు హంపి, జూనియర్ ప్రపంచ చాంపియన్ దివ్య దేశ్ముఖ్ (మహారాష్ట్ర) నాలుగో రౌండ్లోకి దూసుకెళ్లారు. మూడో రౌండ్లో హంపి 1.5–0.5తో కులోన్ క్లౌడియా (పోలాండ్)పై, దివ్య 1.5–0.5తో టియోడోరా ఇంజాక్ (సెర్బియా)పై విజయం సాధించారు. ఆదివారం జరిగిన మూడో రౌండ్ రెండో గేమ్లో హంపి 44 ఎత్తుల్లో క్లౌడియాను ఓడించింది. ఇంజాక్తో జరిగిన రెండో గేమ్ను దివ్య 30 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకుంది. శనివారం జరిగిన మూడో రౌండ్ తొలి గేమ్ను హంపి 102 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకోగా... ఇంజాక్తో జరిగిన గేమ్లో దివ్య 39 ఎత్తుల్లో గెలిచింది. మూడో రౌండ్లోని రెండు గేమ్లు ముగిశాక భారత్కే చెందిన ద్రోణవల్లి హారిక–స్టావ్రూలా (గ్రీస్), వంతిక అగర్వాల్–కాటరీనా లాగ్నో (రష్యా), వైశాలి–కరిస్సా యిప్ (అమెరికా) 1–1తో సమంగా నిలిచారు. దాంతో ఈరోజు టైబ్రేక్ గేమ్లు నిర్వహించి విజేతలను నిర్ణయిస్తారు. -
ప్రజ్ఞానంద తొలి గేమ్ ‘డ్రా’
బాకూ (అజర్బైజాన్): ప్రపంచకప్ చెస్ టోర్నీ సెమీఫైనల్ను భారత గ్రాండ్మాస్టర్ ఆర్.ప్రజ్ఞానంద ఆత్మవిశ్వాసంతో ప్రారంభించాడు. ఫాబియనో కరువానా (అమెరికా)తో జరిగిన సెమీస్ తొలి గేమ్ను ప్రజ్ఞానంద 78 ఎత్తులో ‘డ్రా’ చేసుకున్నాడు. ప్రత్యర్థికి పలు మార్లు మెరుగైన అవకాశాలు వచ్చినా...చివరి వరకు పోరాడిన అతను ఓటమినుంచి తప్పించుకోగలిగాడు. శనివారం నల్లపావులతో ఆడి కరువానాను నిరోధించగలిగిన భారత కుర్రాడు ఆదివారం తెల్ల పావులతో ఆధిక్యం ప్రదర్శించగలిగితే ఫైనల్ చేరే అవకాశాలు మెండుగా ఉంటాయి. మరో సెమీస్లో వరల్డ్ నంబర్వన్ మాగ్నస్ కార్ల్సన్ తన స్థాయిని ప్రదర్శించాడు. స్థానిక ఆటగాడు నిజాత్ అబసోవ్ (అజర్బైజాన్)తో జరుగుతున్న ఈ పోరులో తొలి గేమ్ను అతను 43 ఎత్తుల్లో గెలుచుకున్నాడు. శనివారం తన రెండో గేమ్ను కార్ల్సన్ ‘డ్రా’ చేసుకోగలిగినా ఫైనల్లోకి అడుగు పెడతాడు. -
కర్జాకిన్కు టైటిల్
ప్రపంచ కప్ చెస్ చాంపియన్షిప్ బాకు (అజర్బైజాన్): ప్రపంచ కప్ చెస్ చాంపియన్షిప్లో రష్యా గ్రాండ్మాస్టర్ సెర్గీ కర్జాకిన్ విజేతగా నిలిచాడు. తన దేశానికే చెందిన పీటర్ స్విద్లెర్తో జరిగిన ఫైనల్లో కర్జాకిన్ 6-4 స్కోరుతో విజయం సాధించాడు. నిర్ణీత నాలుగు క్లాసిక్ గేమ్ల తర్వాత ఇద్దరూ 2-2తో సమంగా నిలిచారు. ఆ తర్వాత ర్యాపిడ్ పద్ధతిలో నాలుగు గేమ్లు నిర్వహించగా ఇద్దరూ చెరో రెండింటిలో గెలుపొందడంతో స్కోరు 4-4తో సమమైంది. ఈసారి బ్లిట్జ్ పద్ధతిలో రెండు గేమ్లు నిర్వహించగా... రెండింటిలో కర్జాకిన్ నెగ్గి విజేతగా అవతరించాడు. కర్జాకిన్కు లక్షా 20 వేల డాలర్లు (రూ. 78 లక్షల 46 వేలు), రన్నరప్ స్విద్లెర్కు 80 వేల డాలర్లు (రూ. 52 లక్షల 30 వేలు) ప్రైజ్మనీగా లభించాయి. ఈ టోర్నీ ద్వారా కర్జాకిన్తోపాటు స్విద్లెర్ వచ్చే ఏడాది మార్చిలో జరిగే క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్కు అర్హత సాధించారు. క్యాండిడేట్స్ టోర్నీకి ఇప్పటికే విశ్వనాథన్ ఆనంద్ (భారత్), వాసిలిన్ తొపలోవ్ (బల్గేరియా), ఫాబియానో, హికారు నకముర (అమెరికా) కూడా అర్హత పొందారు. ఈ ఏడాది ముగిసేలోపు అత్యుత్తమ రేటింగ్ ఉన్న మరో ఇద్దరు ఆటగాళ్లు క్యాండిడేట్స్ టోర్నీలో పాల్గొంటారు. క్యాండిడేట్స్ టోర్నీ విజేతతో వచ్చే ఏడాది జరిగే ప్రపంచ చాంపియన్షిప్లో డిఫెండింగ్ చాంపియన్ మాగ్నస్ కార్ల్సన్ (నార్వే) తలపడతాడు.