
త్వరలో ఇంగ్లండ్తో జరుగబోయే ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కోసం మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ను ఎంపిక చేయనందుకు భారత సెలెక్టర్లపై బీసీసీఐ మాజీ బాస్ సౌరవ్ గంగూలీ తీవ్ర స్థాయిలో మండిపడ్డాడు. ఇంగ్లండ్ పర్యటనలో శ్రేయస్ తప్పక జట్టులో ఉండాల్సిందని గంగూలీ అభిప్రాయపడ్డాడు.
గత కొంతకాలంగా దేశవాలీ క్రికెట్లో అద్భుతంగా రాణిస్తున్న శ్రేయస్ను ఎందుకు జట్టులోకి తీసుకోలేదని నిలదీశాడు. శ్రేయస్కు భారత టెస్ట్ జట్టులో ఉండే అన్ని అర్హతలు ఉన్నాయని అన్నాడు. శ్రేయస్ ఇటీవలి కాలంలో అద్భుతంగా ఆడుతూ ఒత్తిడిలోనూ పరుగులు చేస్తున్నాడని.. జట్టు అవసరాల దృష్ట్యా తగు రీతిలో ఆడుతూ బాధ్యతగా వ్యవహరిస్తున్నాడని తెలిపాడు.
తనే భారత సెలెక్టర్ను అయితే ఈ పరిస్థితుల్లో శ్రేయస్కు తప్పక అవకాశం ఇచ్చే వాడినని అన్నాడు. జట్టులోకి తీసుకొని శ్రేయస్ ఏం చేశేవాడో చూసే వాడినని తెలిపాడు.
దిగ్గజాలు విరాట్, రోహిత్, అశ్విన్ల రిటైర్మెంట్ తర్వాత ఇంగ్లండ్లో టీమిండియా విజయావకాశాలపై స్పందిస్తూ.. ఈ జట్టుతో భారత తప్పక గెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. బాగా బ్యాటింగ్ చేసి, బుమ్రాను ఫిట్గా ఉంచుకోగలిగితే ఇంగ్లండ్లో భారత్కు తిరుగుండదని అభిప్రాయపడ్డాడు. 2020-21 ఆసీస్ పర్యటనలో విరాట్, రోహిత్ లేకుండానే యువ ఆటగాళ్లతో నిండిన టీమిండియా విజయం సాధించిన విషయాన్ని గుర్తు చేశాడు.
ఇంగ్లండ్ పర్యటనకు శ్రేయస్ను ఎంపిక చేయకపోవడంపై చాలా మంది మాజీ క్రికెటర్లు భారత సెలెక్టర్లను టార్గెట్ చేస్తున్నారు. తాజాగా ఈ జాబితాలో సౌరవ్ గంగూలీ కూడా చేరాడు. గత ఏడాది కాలంగా విశేషంగా రాణిస్తున్న శ్రేయస్ను భారత టెస్ట్ జట్టుకు ఎంపిక చేయకపోవడం అన్యాయమని గంగూలీ అభిప్రాయపడ్డాడు. శ్రేయస్ లేని లోటు ఇంగ్లండ్ పర్యటనలో స్పష్టంగా కనిపించే అవకాశముందని తెలిపాడు.
కాగా, ఇంగ్లండ్తో ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కోసం భారత సెలెక్టర్లు కొద్ది రోజుల కిందటే జట్టును ప్రకటించారు. ప్రస్తుతం భారత జట్టు ఇంగ్లండ్లో ల్యాండై సాధన మొదలుపెట్టింది. జూన్ 20 నుంచి టెస్ట్ సిరీస్ ప్రారంభమవుతుంది.
ఈ సిరీస్తో శుభ్మన్ గిల్ భారత కెప్టెన్గా పరిచయమవుతాడు. రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించడంతో ఈ సిరీస్కు ముందే గిల్ను కెప్టెన్గా ఎంపిక చేశారు. ఈ సిరీస్కు ముందే స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి కూడా టెస్ట్లకు రిటైర్మెంట్ ప్రకటించాడు.
ఇంగ్లండ్తో ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్కు భారత జట్టు..
శుభ్మన్ గిల్ (కెప్టెన్), సాయి సుదర్శన్, కరుణ్ నాయర్, అభిమన్యు ఈశ్వరన్, యశస్వి జైస్వాల్, నితీశ్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, వాషింగ్టన్ సుందర్, రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, ధృవ్ జురెల్, జస్ప్రీత్ బుమ్రా, ప్రసిద్ద్ కృష్ణ, మహ్మద్ సిరాజ్, ఆకాశ్దీప్, అర్షదీప్ సింగ్, కుల్దీప్ యాదవ్
ఇంగ్లండ్తో ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ షెడ్యూల్..
జూన్ 20-24- తొలి టెస్ట్ (లీడ్స్)
జులై 2-6- రెండో టెస్ట్ (బర్మింగ్హమ్)
జులై 10-14- మూడో టెస్ట్ (లార్డ్స్)
జులై 23-27- నాలుగో టెస్ట్ (మాంచెస్టర్)
జులై 31-ఆగస్ట్ 4- ఐదో టెస్ట్ (కెన్నింగ్స్టన్ ఓవల్)