Final Round Started At Indian Racing League Hyderabad - Sakshi
Sakshi News home page

Indian Racing League: హైదరాబాద్‌లో ఇండియన్‌ రేసింగ్‌ లీగ్‌ సందడి

Published Sat, Dec 10 2022 4:44 PM

Final Round Started At Indian Racing League Hyderabad - Sakshi

హైదరాబాద్‌లో మరోసారి కార్‌ రేసింగ్‌ సందడి షురూ అయింది. ఎన్టీఆర్‌ మార్గ్‌లో ఇండియన్‌ రేసింగ్‌ లీగ్‌ ఫైనల్‌ రౌండ్‌ జరుగుతుంది. నెక్లెస్‌ రోడ్డులోని ఎన్టీఆర్‌ మార్గ్‌ వద్ద ఏర్పాటు చేసిన రేసింగ్‌ ట్రాక్‌పై కార్లు రయ్‌.. రయ్‌మని దూసుకెళ్లాయి. కాగా రేసింగ్‌లో ఆరు టీమ్స్‌, 12 కార్లు, 24 మంది డ్రైవర్స్‌ పాల్గొన్నారు.గంటకు 250-300 కిలోమీటర్ల మెరుపు వేగంతో దూసుకుపోతూ అభిమానులను అలరిస్తున్నాయి. 

వచ్చే ఫిబ్రవరిలో జరుగనున్న ఫార్ములా–ఈ  పోటీలకు సన్నాహకంగా ఈ ట్రయల్స్‌ కొనసాగుతున్న సంగతి  తెలిసిందే. నవంబర్‌లో జరిగిన ప్రమాదం, బ్రేక్‌డౌన్స్‌ కారణంగా  పోటీలు లేకుండానే ట్రయల్స్‌కే కార్‌ రేసింగ్‌ పరిమితమైంది. కన్ను మూసి తెరిచే లోపు వాయువేగంతో రయ్‌ మంటూ దూసుకుపోయిన కార్లు   సందర్శకులకు కనువిందు చేశాయి. ఈ పోటీల నిర్వహణ కోసం హెచ్‌ఎండీఏ  అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ట్రాక్‌ను మరోసారి  క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. పోటీలను వీక్షించేందుకు అనుగుణంగా నెక్లెస్‌రోడ్డులో గ్యాలరీలను సిద్ధం చేశారు. 

హైదరాబాద్‌కు చెందిన  బ్లాక్‌బర్డ్స్‌ (రేసర్ల టీమ్‌) ఢిల్లీకి చెందిన స్పీడ్‌ డిమాన్స్, బెంగళూరుకు చెందిన స్పీడ్‌స్టర్స్, చెన్నై టీమ్‌ టర్బోరైడర్స్, గోవా ఏసెస్‌ బృందాలు ఈ పోటీల్లో  నెక్లెస్‌రోడ్డు స్ట్రీట్‌ సర్క్యూట్‌పై దూసుకెళ్లనున్నాయి. మోటర్‌ స్పోర్ట్స్‌ అభిమానులను విశేషంగా ఆకట్టుకోనున్న ఈ పోటీల్లో నగరానికి చెందిన రేసర్లు కూడా పాల్గొననున్నారు. స్విస్‌ ఇండియన్‌ ప్రొఫెషనల్‌ పోర్శీ ఫ్యాక్టరీ డ్రైవర్‌ నీల్‌ జానీ, ఆస్టన్‌ మార్టిన్‌ రేసింగ్‌ అకాడమీ డ్రైవర్‌ అఖిల్‌ రవీంద్రలతోపాటు ఫిమేల్‌ ఎఫ్‌–4 రేసింగ్‌ డ్రైవర్‌ లోలా లోవిన్‌ ఫోసీ కూడా పాల్గొననున్నారు. ఈ పోటీలను వీక్షించేందుకు  ఈ సారి  ప్రేక్షకులు, మోటార్‌ స్పోర్ట్స్‌ అభిమానులు ఎక్కువ సంఖ్యలో  పాల్గొనే  అవకాశం ఉన్నట్లు  భారతీయ మోటర్‌స్పోర్ట్స్‌ కంపెనీ, రేసింగ్‌ ప్రమోషన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (ఆర్‌పీపీఎల్‌)వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ పోటీల్లో మొత్తం 24 మంది విదేశీ, భారతీయ రైడర్లు పాల్గొననున్నారు.  

Advertisement
Advertisement