
ఇంగ్లండ్ గడ్డపై టీమిండియా ఆల్రౌండర్ శార్దూల్ ఠాకూర్ సునామీ శతకంతో విరుచుకుపడ్డాడు. బెకింగ్హమ్ వేదికగా భారత సీనియర్ జట్టుతో జరిగిన ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్లో కేవలం 68 బంతుల్లోనే అజేయమైన 122 పరుగులు చేశాడు (భారత-ఏ జట్టుకు ఆడుతూ). ఈ మ్యాచ్లో శార్దూల్ తొలుత బంతితోనూ మెరిశాడు (4 వికెట్లు తీశాడు). కేఎల్ రాహుల్, శుభ్మన్ గిల్, కరుణ్ నాయర్ వంటి స్టార్లతో నిండిన భారత సీనియర్ల బ్యాటింగ్ లైనప్ను ముప్పుతిప్పలు పెట్టాడు.
తాజా ప్రదర్శనతో శార్దూల్ ఇంగ్లండ్తో తొలి టెస్ట్కు ముందు భారత సెలెక్టర్లకు కొత్త తలనొప్పి తెచ్చిపెట్టాడు. ఆస్ట్రేలియా గడ్డపై సెంచరీతో మెరిసిన మరో ఆల్రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డికి పోటీగా మారాడు. శార్దూల్ తాజా ప్రదర్శన నేపథ్యంలో జూన్ 20 నుంచి ఇంగ్లండ్తో ప్రారంభం కాబోయే తొలి టెస్ట్లో ఎవరికి అవకాశం ఇవ్వాలో అర్దంకాక సెలెక్టర్లు తలలు పట్టుకున్నారు.
మ్యాచ్ విషయానికొస్తే.. ఇంగ్లండ్తో ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్కు ముందు భారత్, భారత్-ఏ జట్ల మధ్య నాలుగు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ జరిగింది. తొలి టెస్ట్కు ముందు భారత ఆటగాళ్లకు రెస్ట్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ మ్యాచ్ను మూడు రోజుల్లోనే ముగించారు. ఈ మ్యాచ్ డ్రాగా ముగిసింది.
ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత సీనియర్ జట్టు 459 పరుగులు చేసింది. శుభ్మన్ గిల్, కేఎల్ రాహల్ హాఫ్ సెంచరీలతో మెరిశారు. అనంతరం బ్యాటింగ్కు దిగిన భారత-ఏ మూడో రోజు ఆటను రద్దు చేసే సమయానికి భారీ స్కోర్ చేసింది.
19 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద మూడో రోజు ఆటను ప్రారంభించిన శార్దూల్.. జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, ప్రసిధ్ కృష్ణ వంటి హేమాహేమీ పేసర్లున్న భారత బౌలింగ్ లైనప్కు చుక్కలు చూపించాడు.
అంతకుముందు రెండో రోజు ఆటలో మరో భారత-ఏ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ కూడా మెరుపు శతకంతో విరుచుకుపడ్డాడు. సర్ఫరాజ్ ఖాన్ కూడా కేవలం 76 బంతుల్లో 101 పరుగులు చేసి భారత సెలెక్టర్లకు సవాలు విసిరాడు.
ఈ మ్యాచ్లో సర్ఫరాజ్, శార్దూల్ అద్భుతమైన ప్రదర్శనలతో సత్తా చాటడంతో ఇదివరకే భారత సీనియర్ జట్టులో చోటు ఖాయమనున్న కరుణ్ నాయర్, నితీశ్ కుమార్లకు భయం పట్టుకుంది.
ఇంగ్లండ్తో తొలి టెస్ట్లో సర్ఫరాజ్ స్థానంపై అనుమానం ఉన్నప్పటికీ.. తాజా ప్రదర్శనతో శార్దూల్కు తుది జట్టులో చోటు దక్కడం ఖాయమని తెలుస్తుంది. అంతకుముందు కరుణ్ నాయర్ ఇంగ్లండ్ లయన్స్తో జరిగిన తొలి అనధికారిక టెస్ట్ మ్యాచ్లో డబుల్ సెంచరీతో మెరిశాడు కాబట్టి అతని చోటుపై ఎలాంటి అనుమానం లేదు. ఇంగ్లండ్తో తొలి టెస్ట్ లీడ్స్లోని హెడింగ్లే మైదానంలో జూన్ 20 నుంచి ప్రారంభం కానుంది.
ఇంగ్లండ్తో టెస్టులకు భారత జట్టు..
శుబ్మన్ గిల్ (కెప్టెన్), రిషభ్ పంత్ (వైస్ కెప్టెన్), యశస్వి జైశ్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, అభిమన్యు ఈశ్వరన్, కరుణ్ నాయర్, నితీశ్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేడా, ధ్రువ్ జురెల్, వాషింగ్టన్ సుదంర్, శార్దుల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఆకాశ్ దీప్, అర్షదీప్ సింగ్, కుల్దీప్ యాదవ్