IPL 2025: గుజరాత్‌, ఆర్సీబీ, ముంబై జట్లకు భారీ షాకిచ్చిన ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు | England Announced ODI, T20 Squad For West Indies Series | Sakshi
Sakshi News home page

IPL 2025: గుజరాత్‌, ఆర్సీబీ, ముంబై జట్లకు భారీ షాకిచ్చిన ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు

May 13 2025 7:17 PM | Updated on May 13 2025 7:47 PM

England Announced ODI, T20 Squad For West Indies Series

ఐపీఎల్‌ ఫ్రాంచైజీలు గుజరాత్‌ టైటాన్స్‌, ఆర్సీబీ, ముంబై ఇండియన్స్‌కు ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు షాకిచ్చింది. ప్లే ఆఫ్స్‌ రేసులో ముందు వరుసలో ఉన్న ఈ మూడు జట్లకు చెందిన ప్రధాన ఆటగాళ్లను త్వరలో వెస్టిండీస్‌తో జరుగబోయే వన్డే సిరీస్‌కు ఎంపిక చేసింది.  

ఐపీఎల్‌ 2025లో కీలకమైన ప్లే ఆఫ్స్‌ మ్యాచ్‌లు జరుగుతుండగా వెస్టిండీస్‌, ఇంగ్లండ్‌ మధ్య వన్డే సిరీస్‌ జరుగనుంది. భారత్‌, పాక్‌ మధ్య యుద్దం కారణంగా ఐపీఎల్‌ వారం రోజుల వాయిదా పడిన విషయం తెలిసిందే. అనంతరం ప్రకటించిన రివైజ్డ్‌ షెడ్యూల్‌తో ఈ సిరీస్‌ క్లాష్‌ అయ్యింది.

ఇంగ్లండ్‌ వేదికగా జరుగనున్న ఈ సిరీస్‌లో తొలి వన్డే మే 29న, రెండో వన్డే జూన్‌ 1, మూడో వన్డే జూన్‌ 3వ తేదీన జరుగనున్నాయి. సరిగ్గా ఇదే తేదీల్లో ఐపీఎల్‌ క్వాలిఫయర్‌-1, క్వాలిఫయర్‌-2, ఫైనల్‌ మ్యాచ్‌లు జరుగనున్నాయి.

ఐపీఎల్‌లో ప్లే ఆఫ్స్‌ రేసుకు సమీపంలో ఉన్న జట్లకు చెందిన ఆటగాళ్లను, అదే తేదీల్లో జరిగే సిరీస్‌కు ఎంపిక చేయడంతో సదరు ఐపీఎల్‌ ఫ్రాంచైజీలకు పాలుపోవడం లేదు. ఇంగ్లండ్‌ వన్డే జట్టుకు ఎంపిక చేసిన ఆటగాళ్లలో జోస్‌ బట్లర్‌ గుజరాత్‌కు.. జేకబ్‌ బేతెల్‌ ఆర్సీబీ.. విల్‌ జాక్స్‌ ముంబై ఇండియన్స్‌కు ఆడుతున్నారు. ఈ మూడు ఫ్రాంచైజీలకు ఈ ముగ్గురు ఆటగాళ్లు చాలా కీలకం.

ప్లే ఆఫ్స్‌ మ్యాచ్‌ల్లో బట్లర్‌, బేతెల్‌, జాక్స్‌ లేకపోవడం ఆయా జట్లను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. డబ్ల్యూటీసీ ఫైనల్స్‌ కారణంగా ఇప్పటికే ఆస్ట్రేలియా, సౌతాఫ్రికాకు చెందిన ఆటగాళ్లు లీగ్‌ తదుపరి మ్యాచ్‌లకు అందుబాటులో ఉండటం అనుమానంగా మారింది. తాజాగా ఇం​గ్లండ్‌ క్రికెట్‌ బోర్డు తీసుకున్న ఈ నిర్ణయంతో ప్లే ఆఫ్స్‌ రేసులో ఉన్న ఐపీఎల్‌ ఫ్రాంచైజీల కష్టాలు మరింత తీవ్రమయ్యాయి.

ఆటగాళ్లు కూడా దేశమా.. ఐపీఎలా అన్న సందిగ్దంలో ఉండిపోయారు. ఐపీఎల్‌ వాయిదా పడటం ఇన్ని సమస్యలు తెచ్చి పెట్టింది. విండీస్‌తో వన్డే సిరీస్‌తో పాటు తదుపరి జరుగబోయే మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ (జూన్‌ 6, 8, 10) కోసం కూడా ఇంగ్లండ్‌ జట్లను ఇవాళ ప్రకటించారు. రెండు జట్లకు సారధిగా హ్యారీ బ్రూక్‌ ఎంపికయ్యాడు.

వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌కు ఇంగ్లండ్‌ జట్టు: హ్యారీ బ్రూక్‌ (కెప్టెన్‌), జోస్‌ బట్లర్‌ (గుజరాత్‌), జేకబ్‌ బేతెల్‌ (ఆర్సీబీ), విల్‌ జాక్స్‌ (ముంబై ఇండియన్స్‌), జోఫ్రా ఆర్చర్ (రాజస్థాన్‌ రాయల్స్‌), జేమీ ఓవర్టన్‌ (సీఎస్‌కే), గస్ అట్కిన్సన్, టామ్ బాంటన్, బ్రైడాన్ కార్స్, బెన్ డకెట్, టామ్ హార్ట్లీ, సాకిబ్ మహమూద్, మాథ్యూ పాట్స్, ఆదిల్ రషీద్, జో రూట్, జామీ స్మిత్

విండీస్‌తో టీ20 సిరీస్‌కు ఇంగ్లండ్‌ జట్టు: హ్యారీ బ్రూక్ (కెప్టెన్), రెహాన్ అహ్మద్, టామ్ బాంటన్, జేకబ్‌ బేతెల్‌, జోస్ బట్లర్, బ్రైడాన్ కార్స్, లియామ్ డాసన్, బెన్ డకెట్, విల్ జాక్స్, సాకిబ్ మహమూద్, మాథ్యూ పాట్స్, జేమీ ఓవర్టన్, ఆదిల్ రషీద్, ఫిల్ సాల్ట్, ల్యూక్ వుడ్

  • జోఫ్రా ఆర్చర్‌, జేమీ ఓవర్టన్‌ కూడా వేర్వేరు ఐపీఎల్‌ జట్లకు ప్రాతినిథ్యం వహిస్తున్నా ఆ జట్లు ఇదివరకే ప్లే ఆఫ్స్‌ రేసు నుంచి నిష్క్రమించాయి.

మరోవైపు ఇదే సిరీస్‌ (వన్డే) కోసం విండీస్‌ జట్టును కూడా ఇదివరకే ప్రకటించారు. విండీస్‌ ఆటగాళ్లలో ఫెర్ఫాన్‌ రూథర్‌ఫోర్డ్‌ (గుజరాత్‌), రొమారియో షెపర్డ్‌ (ఆర్సీబీ), షమార్‌ జోసఫ్‌ (లక్నో) వేర్వేరు జట్ల తరఫున ఐపీఎల్‌లో ఆడుతున్నారు. రూథర్‌ఫోర్డ్‌, రొమారియో షెపర్డ్‌ ప్రాతినిథ్యం వహిస్తున్న జట్లు కూడా ఐపీఎల్‌ ప్లే ఆఫ్స్‌ రేసులో ముందున్నాయి. అయితే ఈ సిరీస్‌తో ఐపీఎల్‌ ప్లే ఆఫ్స్‌ మ్యాచ్‌లు క్లాష్‌ కావడంతో వీరు కూడా ఆయా జట్లకు అందుబాటులో ఉండటం అనుమానంగా మారింది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement