'దేశం వైపా... ఐపీఎల్‌ వైపా?'.. విధేయత చూపించాల్సిన సమయం | Dean Elgar urges SA Teammates To Choose National Duty Over IPL | Sakshi
Sakshi News home page

Dean Elgar: 'దేశం వైపా... ఐపీఎల్‌ వైపా?'.. విధేయత చూపించాల్సిన సమయం

Mar 8 2022 8:08 AM | Updated on Mar 8 2022 8:16 AM

Dean Elgar urges SA Teammates To Choose National Duty Over IPL - Sakshi

11 మంది దక్షిణాఫ్రికా క్రికెటర్లకు ప్రస్తుత ఐపీఎల్‌తో కాంట్రాక్ట్‌ ఉండగా ఇందులో 10 మంది సఫారీ టెస్టు, వన్డే జట్లలో రెగ్యులర్‌ సభ్యులు..

రెండు దశాబ్దాల కిందట చూసుకుంటే క్రికెటర్లు దేశానికి ప్రాతినిధ్యం వహించడం గొప్పగా భావించేవాళ్లు. సెంచరీలైనా.. వికెట్లు అయినా.. గౌరవమైనా.. చీత్కారాలైనా ఏవీ చూసుకున్నా ఇందులోనే లభించేవి. దేశం తరపున ఆడి మ్యాచ్‌ గెలిచామంటే మనం గెలిచాము అన్నంతగా క్రికెట్‌ అభిమానులు పండగ చేసుకునేవారు. ఒక ఆటగాడు ఫామ్‌ కోల్పో‍తే ఏ కౌంటీ క్రికెట్‌కో.. లేక దేశవాలీ టోర్నీల్లో రాణించి తిరిగి జట్టులోకి వచ్చేవారు. ఇప్పటికి ఇలాంటివి జరుగుతున్నప్పటికి బాగా తగ్గిపోయిందనే చెప్పొచ్చు. 

ముఖ్యంగా ఐపీఎల్‌, బిగ్‌బాష్‌ లాంటి ప్రైవేట్‌ లీగ్స్‌ వచ్చిన తర్వాత ఆటగాళ్లు దేశానికంటే డబ్బులకే ఎక్కువ ప్రాధాన్యమిస్తూ వచ్చారు. వెస్టిండీస్‌ జట్టు ఇందుకు ఉదాహరణ. ఒకప్పుడు వెస్టిండీస్‌ అంటే అరవీర భయంకరులు గుర్తుచ్చేవారు. రెండుసార్లు ప్రపంచకప్‌ విజేతలైన వెస్టిండీస్‌ ఇప్పుడు మాత్రం సాధారణ జట్టులా మారిపోయింది. కారణం ఇలాంటి ప్రైవేట్‌ లీగ్స్‌. ఇప్పుడు చూసుకుంటే విండీస్‌ క్రికెటర్లు లీగ్‌ క్రికెట్‌లోనే ఎక్కువగా కనిపిస్తున్నారు. ఎందుకంటే వారికి డబ్బులు ముఖ్యం. తాజాగా దక్షిణాఫ్రికా టెస్టు కెప్టెన్‌ డీన్‌ ఎల్గర్‌ తన జట్టు సహచరులను ఐపీఎల్‌ కంటే దేశానికి తొలి ప్రాధాన్యత ఇవ్వాలని అడగడం ఆసక్తిని సంతరించుకుంది.

ఐపీఎల్‌ ఈనెల 26న ప్రారంభం కానుండగా... దక్షిణాఫ్రికా జట్టు అదే సమయంలో స్వదేశంలో బంగ్లాదేశ్‌తో మూడు వన్డేలు, రెండు టెస్లులు ఆడాల్సి ఉంది. ఆర్థికంగా భారీ మొత్తం అందుకునే ఐపీఎల్‌కు కాకుండా దేశం తరఫున ఆడేందుకే తొలి ప్రాధాన్యత ఇవ్వాలని దక్షిణాఫ్రికా క్రికెటర్లను టెస్టు  జట్టు కెప్టెన్‌ డీన్‌ ఎల్గర్‌ కోరుతున్నాడు. మొత్తం 11 మంది దక్షిణాఫ్రికా క్రికెటర్లకు ప్రస్తుత ఐపీఎల్‌తో కాంట్రాక్ట్‌ ఉండగా ఇందులో 10 మంది సఫారీ టెస్టు, వన్డే జట్లలో రెగ్యులర్‌ సభ్యులు. ‘దక్షిణాఫ్రికాకు ఆడటం వల్లే మీకు ఐపీఎల్‌ అవకాశం వచ్చిన విషయం మరచిపోవద్దు. వారు విధేయత చూపించుకోవాల్సిన సమయమిది. అవసరమైతే వారితో మాట్లాడి సరైన నిర్ణయం తీసుకునేలా ప్రయత్నిస్తాను’ అని ఎల్గర్‌ అన్నాడు.  

చదవండి: IPL 2022: డు ప్లెసిస్‌కు భారీ షాక్‌.. ఆర్సీబీ కెప్టెన్‌గా దినేష్ కార్తీక్!

PAK vs AUS: వైరల్‌గా మారిన పాక్‌ క్రికెటర్‌ చర్య.. ఏం జరిగింది

Advertisement
 
Advertisement
Advertisement