న్యూఢిల్లీ: విన్స్టన్–సాలెమ్ ఓపెన్ ఏటీపీ–250 టెన్నిస్ టోర్నీలో భారత ప్లేయర్ దక్షిణేశ్వర్ సురేశ్ పోరాటం ముగిసింది. అమెరికాలోని నార్త్ కరోలినాలో జరుగుతున్న ఈ టోర్నీలో 394వ ర్యాంకర్ దక్షిణేశ్వర్ రెండో రౌండ్లో నిష్క్రమించాడు. ప్రపంచ 51వ ర్యాంకర్ సెరున్డోలో (అర్జెంటీనా)తో జరిగిన మ్యాచ్లో దక్షిణేశ్వర్ 6–7 (10/12), 3–6తో ఓటమి చవిచూశాడు. 93 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో దక్షిణేశ్వర్ 10 ఏస్లు సంధించి, ఆరు డబుల్ ఫాల్ట్లు చేశాడు.
తొలి సెట్ను టైబ్రేక్లో కోల్పోయిన ఈ తమిళనాడు ప్లేయర్ రెండో సెట్లో ఒకసారి తన సర్వీస్ను చేజార్చుకున్నాడు. నెట్ వద్దకు 25 సార్లు దూసుకొచ్చి 21 సార్లు పాయింట్లు గెలిచిన దక్షిణేశ్వర్ 36 విన్నర్స్ కొట్టి, 38 అనవసర తప్పిదాలు చేశాడు. రెండో రౌండ్లో ఓడిన దక్షిణేశ్వర్కు 7,180 డాలర్ల (రూ. 6 లక్షల 84 వేలు) ప్రైజ్మనీతోపాటు 13 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి.


