హైదరాబాద్: బాంబు బూచితో ఓ వ్యక్తి శంషాబాద్ ఎయిర్పోర్టు భద్రతాధికారులను కంగారు పెట్టాడు. మంగళవారం సాయంత్రం 6ఈ–208 విమానం 181 మందితో ఏపీలోని భోగాపురం బయల్దేరేందుకు సిద్ధమైంది. దాంట్లో ప్రయాణించాల్సిన సురేష్.. విమానం ఎక్కి కూర్చున్నాక తన బ్యాగులో బాంబు ఉందని అధికారులకు సమాచారం అందించాడు.
అప్రమత్తమైన అధికారులు అతడిని మరోసారి ప్రశ్నించగా... తనకు వేరేవారు చెప్పారని సమాధానమిచ్చాడు. దీంతో తనిఖీలు ప్రారంభించారు. విమానంలోని అందరినీ దించేసి లగేజీలను పరిశీలించారు. బాంబు లేదని నిర్ధారించుకున్నారు. సాయంత్రం 5.25కు బయల్దేరాల్సిన విమానం రాత్రి 7.20కు టేకాఫ్ తీసుకుంది. సురేష్ను విమానాశ్రయ పోలీస్లు అదుపులోకి తీసుకుని, ఔట్పోస్టు పోలీసులకు అప్పగించగా కేసు నమోదు చేశారు.
దుబాయ్ విమానంలో సాంకేతిక లోపం
ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్–951 విమానం మంగళవారం రాత్రి 7.15కు శంషాబాద్ నుంచి దుబాయ్ వెళ్లేందుకు సిద్ధమైంది. కొద్ది క్షణాల ముందు పైలట్లు సాంకేతిక సమస్య గుర్తించడంతో ఎయిర్క్రాఫ్ట్ ఆన్ గ్రౌండ్ను ప్రకటించారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లతో రాత్రి 10కి బయల్దేరింది.


