భార్యను కిరాతకంగా చంపిన భర్త
హైదరాబాద్, ఉప్పల్: కట్టుకున్న భార్యను ఓ వ్యక్తి అనుమానంతో కత్తులతో పొడిచి అతి కిరాతకంగా హత్య చేశాడు. ఈ సంఘటన ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చిలుకానగర్ శనివారం తీవ్ర కలకలం రేపింది. పోలీసులు తెలిపిన మేరకు.. ఏపీలోని ప్రకాశం జిల్లా గిద్దలూరు ప్రాంతానికి చెందిన పోతపాటి సురేష్ (43), జెస్సికా (35) దంపతులు చిలుకానగర్లో అద్దెకు ఉంటున్నారు. సురేష్ సఫిల్గూడలోని ట్రావెల్స్ కంపెనీలో సూపర్ వైజర్గా పనిచేస్తుండగా జెస్సికా తార్నాకలో ఒక ఆసుపత్రిలో నర్సుగా పని చేస్తుంది.
వీరికి ఒక కూతురు (9) ఉంది. తరచూ భార్యాభర్తలు గొడవపడుతూ ఉండేవారని స్థానికులు చెబుతున్నారు. శుక్రవారం సాయంత్రం ఇంటికి వచ్చిన సురేష్ భార్యతో గొడవపడ్డాడు. ఇద్దరూ పెద్దగా అరుచుకున్నారు. ఈ క్రమంలో జెస్సికాను కత్తితో విచక్షణా రహితంగా పొడిచాడు. అది వంగిపోవడంతో మరో కత్తి తీసుకుని హత్య చేశాడు.
శరీరంపై దాదాపు 8 చోట్ల కత్తి పోట్లు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. శనివారం ఉదయం వరకు అక్కడక్కడే తిరుగుతూ.. చివరికి జెస్సికా సోదరికి హత్య చేసిన విషయం చెప్పాడు. ద్విచక్ర వాహనాన్ని ఇంటి వద్దే పార్క్ చేసి పక్కనే ఉన్న ఏటీఎంలో డబ్బు డ్రా చేసుకొని పారిపోయాడు. ఉప్పల్ ఏసీపీ వెంకటరెడ్డి హత్య జరిగిన తీరును కుటుంబ సభ్యులతో ఆరా తీశారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.


