
న్యూఢిల్లీ: క్రీడల్లో తరచూ తప్పుడు వయో ధ్రువీకరణ సమస్యగా మారుతోంది. ముఖ్యంగా పలు వయో విభాగాల ఈవెంట్లలో పెను విమర్శలు తావిస్తోంది. దీనిపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కఠినంగా వ్యవహరిస్తోంది. అండర్–15, అండర్–16, అండర్–19 క్రికెట్ ఆడే టీనేజర్ల అసలైన వయసు ధ్రువీకరణ కోసం పరీక్షలు చేయిస్తోంది.
ఇప్పుడు కచ్చితమైన వయో నిర్ధారణకు అదనంగా మరో బోన్ మ్యారో (ఎముక వయసు పరీక్ష) టెస్టు చేస్తామని బోర్డు ప్రకటించింది. దీనివల్ల అర్హత గల క్రికెటర్లకు నష్టం వాటిల్లకుండా, అనర్హులను దూరం పెట్టేలా అదనపు పరీక్ష ఉపయోగపడుతుందని బోర్డు భావిస్తోంది. క్రితంసారి అండర్–16లో పాల్గొన్న క్రికెటర్ మరో ఏడాది ఆ వయో విభాగంలో పాల్గొనాలంటే ఈ పరీక్షకు హాజరై నెగ్గాల్సి ఉంటుంది.
ఒకవేళ క్రితం ఏడాదే ఎముక పరీక్షలో ఓ సంవత్సరం పిన్న అని తేలితే మాత్రం మరుసటి ఏడాది ఆ పరీక్షను చేయరు. ఉదాహరణకు అండర్–16 బాలుర క్రికెట్లో కటాఫ్ వయసు 16.5 ఏళ్లు. అంటే పరీక్ష సమయంలో ఎముక వయసు 16.4 ఏళ్లు మాత్రమే ఉండాలి. లేదంటే ఆ సీజన్లో అనుమతించరు. అండర్–15 బాలికల క్రికెట్లో కటాఫ్ వయసు 15 ఏళ్లు. అయితే ఎముక పరీక్ష సమయంలో 14.9 ఏళ్లే ఉండాలి. గత సీజన్లో ఆ బాలిక బోన్ మ్యారో టెస్టులో వయసు 13.9 అని నిర్ధారణ అయితే మరుసటి సీజన్లో టెస్టు పెట్టకుండానే అనుమతిస్తారు.