Ashes Series - Viral Video: తాగింది చాలు.. ఇక ప్యాక్‌ చేసుకోండి! క్రికెటర్లను తరిమేసిన పోలీసులు.. రూట్‌, అలెక్స్‌ క్యారీ ఇంకా...

Australian Cricketers Along With Joe Root Forced To Leave Booze Party Viral - Sakshi

Ashes Series: హోబర్ట్‌ వేదికగా ఐదో టెస్టులో ఇంగ్లండ్‌ను చిత్తుగా ఓడించి యాషెస్‌ సిరీస్‌ విజయాన్ని పరిపూర్ణం చేసుకుంది ఆస్ట్రేలియా. 4-0 తేడాతో యాషెస్‌ ట్రోఫీని కైవసం చేసుకుని సత్తా చాటింది. దీంతో ఆస్ట్రేలియా ఆటగాళ్ల సంబరాలు అంబరాన్నంటాయి. పార్టీలో ఎంజాయ్‌ చేస్తూ సంతోషంలో మునిగితేలారు. వీళ్లు ఆనందంతో తాగితే... ఇంగ్లండ్‌ క్రికెటర్లు బాధతో బాటిళ్లు చేతబట్టారు. ఏదైనా సరే శ్రుతి మించనంత వరకే కదా సాఫీగా సాగేది!

ఒక్కసారి అదుపు తప్పితే ఇక అంతే సంగతులు! విమర్శల పాలు కాక తప్పదు. ఇరు జట్ల ఆటగాళ్లు ఇప్పుడు ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఏకంగా పోలీసులు రంగ ప్రవేశం చేసి హోటల్‌ నుంచి వెళ్లగొట్టే దుస్థితి తెచ్చుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. 

ఇందులో ఇంగ్లండ్‌ కెప్టెన్‌ జో రూట్‌, ఆసీస్‌ ఆటగాళ్లు అలెక్స్‌ క్యారీ, నాథన్‌ లియాన్‌ సహా పలువురు ఆటగాళ్లు ఉన్నారు. ‘‘మరీ అల్లరి ఎక్కువైంది. తొందరగా ప్యాక్‌ చేసుకోవాలి.. అందుకే మేమిక్కడికి వచ్చాము. వెళ్లి నిద్రపోండి. థాంక్యూ’’అంటూ ఓ పోలీసు వాళ్లను అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేశారు. 

ఈ విషయం గురించి టాస్మానియా పోలీసులు మాట్లాడుతూ... ‘‘క్రౌన్‌ ప్లాజా హోబర్ట్‌ నుంచి సోమవారం ఉదయం ఫిర్యాదు అందింది. కొంతమంది తాగిన మత్తులో అక్కడ రభస చేస్తున్నారని చెప్పారు. ఉదయం ఆరు గంటల సమయంలో మా వాళ్లు అక్కడికి వెళ్లి తాగిన వాళ్లను అక్కడి నుంచి పంపించేశారు. అంతకుమించి ఎలాంటి చర్యలు తీసుకోలేదు’’ అని స్పష్టం చేశారు.

యాషెస్‌ సిరీస్‌ 2021-2022లో ఆస్ట్రేలియా విజయ పరంపర:

  • బ్రిస్బేన్‌ టెస్టు- 9 వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌పై ఆసీస్‌ గెలుపు
  • అడిలైడ్‌ టెస్టు: 275 పరుగుల తేడాతో ఘన విజయం
  • మెల్‌బోర్న్‌ టెస్టు: ఇన్నింగ్స్‌ మీద 14 పరుగుల తేడాతో భారీ విజయం
  • సిడ్నీ  టెస్టు: డ్రా
  • హోబర్ట్‌ టెస్టు: 146 పరుగుల తేడాతో కంగారూల జయకేతనం

చదవండి: Virat Kohli: నువ్వు నా పెద్దన్నవు.. ఎల్లప్పుడూ కెప్టెన్‌ కింగ్‌ కోహ్లివే: సిరాజ్‌ భావోద్వేగం

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top