
ఇంగ్లండ్లోని లార్డ్స్ మైదానం వేదికగా ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా మధ్య జరుగుతున్న వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2023-2025 ఫైనల్ ఓ అరుదైన ఘటనకు వేదికైంది. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో ఇరు జట్ల నంబర్ వన్ ఆటగాళ్లు (ఓపెనర్లు) డకౌటయ్యారు.
తొలుత ఆసీస్ ఆటగాడు ఉస్మాన్ ఖ్వాజా 20 బంతులు ఆడి రబాడ బౌలింగ్లో డకౌట్ కాగా.. ఆతర్వాత సౌతాఫ్రికా ప్లేయర్ ఎయిడెన్ మార్క్రమ్ 6 బంతులు ఆడి ఖాతా తెరవకుండా స్టార్క్ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు.
145 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇంగ్లండ్ గడ్డపై ఇలా ఇరు జట్ల నంబర్ వన్ ఆటగాళ్లు టెస్ట్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో డకౌట్ కావడం ఇదే మొదటిసారి. ఈ మ్యాచ్తో కలుపుకొని ఇంగ్లండ్లో ఇప్పటివరకు 561 టెస్ట్ మ్యాచ్లు జరగగా.. ఇలాంటి ఘటన ఈ మ్యాచ్కు ముందు వరకు ఒక్కసారి కూడా జరగలేదు. 1880లో తొట్ట తొలి అధికారిక టెస్ట్ మ్యాచ్ ఇంగ్లండ్లోనే జరిగిన విషయం తెలిసిందే.
ఓవరాల్గా (ప్రపంచంలో ఎక్కడైనా) చూసినా ఓ టెస్ట్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో ఇరు జట్ల నంబర్ వన్ ఆటగాళ్లు డకౌట్లు కావడం ఇది 10వ సారి మాత్రమే. ఈ తరహా తొలి ఘటన 1977లో ఆస్ట్రేలియా, ఇండియా మధ్య మెల్బోర్న్లో జరిగిన టెస్ట్ మ్యాచ్లో జరిగింది.
ఆ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో ఇరు జట్లు నంబర్ వన్ ఆటగాళ్లు సునీల్ గవాస్కర్, జాన్ డైసన్ డకౌట్లయ్యారు. ఆతర్వాత తాజా ఘటనతో కలుపుకొని ఇలాంటివి తొమ్మిది సార్లు జరిగాయి. ఇందులో చివరి నాలుగు సందర్భాలు కలుపుకొని ఆస్ట్రేలియా మొత్తంగా ఆరు సార్లు భాగమైంది. ఆసీస్ భాగమైన చివరి నాలుగు సందర్భాల్లో స్టార్క్ మూడింట భాగం కావడం (ప్రత్యర్ది వికెట్లు తీయడం) మరో విశేషం.

డబ్ల్యూటీసీ ఫైనల్ 2025 విషయానికొస్తే.. ఈ మ్యాచ్ తొలి రోజే 14 వికెట్లు పడ్డాయి. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ 212 పరుగులకు ఆలౌట్ కాగా.. సౌతాఫ్రికా తొలి రోజు ఆట ముగిసే సమయానికి 43 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది.
ఆసీస్ ఇన్నింగ్స్ను రబాడ (5/51), జన్సెన్ (3/49), కేశవ్ మహారాజ్ (1/19), మార్క్రమ్ (1/5) దెబ్బకొట్టగా.. సౌతాఫ్రికాను స్టార్క్ (2/10), హాజిల్వుడ్ (1/10), కమిన్స్ (1/14) ఇబ్బందుల్లోకి నెట్టారు.
ఆసీస్ ఇన్నింగ్స్లో స్టీవ్ స్మిత్ (66), బ్యూ వెబ్స్టర్ (72) టాప్ స్కోరర్లు కాగా.. సౌతాఫ్రికా ఇన్నింగ్స్ను నిలబెట్టే బాధ్యత బవుమా (3 నాటౌట్), బెడింగ్హమ్ (8 నాటౌట్) భుజస్కందాలపై ఉంది.