
ప్రముఖ అంతర్జాయతీయ అథ్లెటిక్ కోచ్, జాతీయ జూనియర్ జట్టు ప్రధాన కోచ్ అయిన నాగపురి రమేశ్పై జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (NADA) సస్పెన్షన్ వేటు వేసింది. డోపింగ్ ఆరోపణల నేపథ్యంలో ఈ మేరకు కఠిన చర్యలకు ఉపక్రమించింది. అతడి దగ్గర కోచింగ్ తీసుకున్న ఇద్దరు క్రీడాకారులు డోప్ టెస్ట్ కు నిరాకరించారు. డోప్ టెస్టుకు శాంపిల్స్ ఇవ్వకుండా దాటవేశారు.
ఏడుగురిపై కూడా వేటు
ఈ క్రమంలో.. నిబంధనల ప్రకారం వారికి కోచ్గా ఉన్న నాగపురి రమేశ్పై నాడా చర్యలు తీసుకుంది. గతంలో అతడు ద్రోణాచారి అవార్డు పొందాడు. అంతేకాదు.. అంతర్జాతీయ అథ్లెట్లు ద్యుతీ చంద్, పారా ఒలంపియన్, పతక విజేత జీవాంజి దీప్తి, అగసార నందిని వంటి దిగ్గజ క్రీడాకారులను తీర్చిదిద్దిన ఘతన నాగపురి రమేశ్కు ఉంది.
ఇదిలా ఉంటే.. రమేశ్తో పాటు మరో ఇద్దరు అసిస్టెంట్ కోచ్లు కరంవీర్ సింగ్, రాకేశ్లను కూడా నాడా సస్పెండ్ చేసింది. అదే విధంగా.. డోపింగ్ టెస్టుకు నిరాకరించిన ఏడుగురు అథ్లెట్లపై కూడా నాడా వేటు వేసింది. వీరిలో పారస్ సింఘాల్, పూజా రాణి, నలుబోతు షణ్ముగ శ్రీనివాస్, చెలిమి ప్రత్యూష, శుభం మహారా, కిరన్, జ్యోతి ఉన్నట్లు సమాచారం.
నేను ఏ తప్పూ చేయలేదు
నాడా సస్పెన్షన్ వేటు నేపథ్యంలో నాగపురి రమేశ్ స్పందించారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రతిభావంతులైన పేద క్రీడాకారులను తీర్చిదిద్దడానికే తన జీవితం ధారబోశానని ఉద్వేగానికి లోనయ్యారు. ఎలాంటి విచారణకైనా తాను సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.