IPL 2025 Revised Schedule: సీఎస్‌కే అభిమానులకు శుభవార్త | All CSK Foreign Players Barring Jamie Overton Are Expected To Re Join The Squad Ahead Of IPL Resumption Says CSK CEO | Sakshi
Sakshi News home page

IPL 2025 Revised Schedule: సీఎస్‌కే అభిమానులకు శుభవార్త

May 14 2025 3:50 PM | Updated on May 14 2025 4:29 PM

All CSK Foreign Players Barring Jamie Overton Are Expected To Re Join The Squad Ahead Of IPL Resumption Says CSK CEO

Photo Courtesy: BCCI

మే 17 నుంచి ఐపీఎల్‌ 2025 పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో సీఎస్‌కే అభిమానులకు శుభవార్త. జేమీ ఓవర్టన్‌ (ఇంగ్లండ్‌) మినహా అందరు విదేశీ ఆటగాళ్లు తమ తదుపరి మ్యాచ్‌లకు అందుబాటులో ఉంటారని ఆ ఫ్రాంచైజీ సీఈవో కాశీ విశ్వనాథ్‌ స్పష్టం చేశారు. ఓవర్టన్‌ తన జాతీయ జట్టుకు (విండీస్‌తో వన్డే సిరీస్‌) ప్రాతినిథ్యం వహించాల్సి ఉండటంతో అతను భారత్‌కు తిరిగి రాలేడని విశ్వనాథ్‌ తెలిపారు.

సీఎస్‌కేలో ఉన్న మిగతా విదేశీ ఆటగాళ్లు డెవాల్డ్‌ బ్రెవిస్‌ (సౌతాఫ్రికా), రచిన్‌ రవీంద్ర (న్యూజిలాండ్‌), సామ్‌ కర్రన్‌ (ఇంగ్లండ్‌), డెవాన్‌ కాన్వే (న్యూజిలాండ్‌), మతీష పతిరణ (శ్రీలంక), నాథన్‌ ఇల్లిస్‌ (ఆస్ట్రేలియా), నూర్‌ అహ్మద్‌ (ఆఫ్ఘనిస్తాన్‌) త్వరలో జట్టులో చేరతారని పీటీఐకి చెప్పారు.

కాగా, ప్రస్తుత ఐపీఎల్‌ సీజన్‌లో సీఎస్‌కే ప్లే ఆఫ్స్‌ రేసు నుంచి ఇదివరకే నిష్క్రమించిన విషయం తెలిసిందే. ఆ జట్టు ఇప్పటివరకు ఆడిన 12 మ్యాచ్‌ల్లో కేవలం​ మూడింట మాత్రమే విజయాలు సాధించిన ప్లే ఆఫ్స్‌ రేసు నుంచి నిష్క్రమించిన తొలి జట్టుగా నిలిచింది. ఈ సీజన్‌లో సీఎస్‌కే మరో రెండు మ్యాచ్‌లు మాత్రమే ఆడాల్సి ఉంది. 

మే 20న రాజస్థాన్‌ రాయల్స్‌తో (ఢిల్లీలో).. మే 25న గుజరాత్‌తో (అహ్మదాబాద్‌లో) తలపడాల్సి ఉంది. ఈ రెండు మ్యాచ్‌లతో సీఎస్‌కేకు కానీ వారి ప్రత్యర్థులకు కానీ ఎలాంటి ఉపయోగం లేదు. ఈ రెండు మ్యాచ్‌లు నామమాత్రంగానే సాగనున్నాయి. గుజరాత్‌ ప్లే ఆఫ్స్‌ బెర్త్‌కు అతి సమీపంలో ఉండగా.. రాజస్థాన్‌ రాయల్స్‌ సీఎస్‌కే తర్వాత ప్లే ఆఫ్స్‌ రేసు నుంచి నిష్క్రమించింది.

ఇదిలా ఉంటే, భారత్‌, పాక్‌ మధ్య యుద్దం కారణంగా ఐపీఎల్‌ 2025 వారం రోజులు వాయిదా పడిన విషయం తెలిసిందే. ఈ మధ్యలో విదేశీ ఆటగాళ్లంతా స్వదేశాలకు వెళ్లిపోయారు. ఐపీఎల్‌ తిరిగి పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో చాలా మంది తిరిగి వచ్చేందుకు సుముఖంగా ఉన్నారు. 

జాతీయ జట్ల అవసరాల దృష్ట్యా ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, ఇంగ్లండ్‌, వెస్టిండీస్‌కు చెందిన ఆటగాళ్లు లీగ్‌ తదుపరి లెగ్‌కు అందుబాటులో ఉండరని తెలుస్తుంది. ఐపీఎల్‌ రీ షెడ్యూల్‌ అయిన తర్వాత వెస్టిండీస్‌, ఇంగ్లండ్‌ మధ్య వన్డే సిరీస్‌తో క్లాష్‌ అయ్యింది. ఐపీఎల్‌ ప్లే ఆఫ్స్‌ జరిగే తేదీల్లోనే ఈ సిరీస్‌ జరుగనుంది.

ఐపీఎల్‌ ముగిసిన తర్వాత వారం​ వ్యవధిలోనే ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా మధ్య అత్యంత​ కీలకమైన డబ్ల్యూటీసీ ఫైనల్‌ జరుగనుంది. ప్రతిష్టాత్మకమైన మ్యాచ్‌కు కేవలం వారం రోజుల సమయం మాత్రమే ఉన్న నేపథ్యంలో ఆ రెండు జట్ల క్రికెట్‌ బోర్డులు ఐపీఎల్‌ తదుపరి లెగ్‌ నుంచి వైదొలగాలని భావిస్తున్నాయి. 

ఆస్ట్రేలియా క్రికెట్‌ బోర్డు ఆటగాళ్ల ఇష్టానికే ఈ విషయాన్ని వదిలిపెట్టగా.. సౌతాఫ్రికా క్రికెట్‌ బోర్డు మాత్రం తమ ఆటగాళ్లను తిరిగి వచ్చేయాలని ఒత్తిడి చేస్తోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement