ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి
బెల్ట్షాపుల నిర్వహణపై ఆగ్రహం
దుబ్బాకటౌన్: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేళ్లు గడిచినా చేసిందేమీ లేదని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాయపోల్ రైతువేదికలో మంగళవారం ఆయన రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యతో కలిసి జిల్లా, మండలస్థాయి అధికారులు, సర్పంచ్లతో విస్తృతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. మండలంలోని గ్రామాల అభివృద్ధి, ప్రజలకు అందుతున్న ప్రభుత్వ సేవలు, వివిధ శాఖల పనితీరు, గ్రామాల్లో నెలకొన్న సమస్యలు, వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై శాఖల వారీగా సమీక్షించారు. ప్రజల సమస్యల పరిష్కారంలో అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, గ్రామాల్లో ప్రతి సమస్యను క్షేత్రస్థాయిలో పరిశీలించి వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. రాబోయే 30 రోజుల్లో రాయపోల్ మండలంలోని అన్ని గ్రామాలను ప్లాస్టిక్ రహిత గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు అధికారులు, సర్పంచ్లు, ప్రజాప్రతినిధులతో కలిసి ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం గ్రామాల్లో కొనసాగుతున్న బెల్ట్షాపుల అంశంపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. మండలంలోని రెండు మద్యం దుకాణాలు పాఠశాలకు సమీపంలో ఉన్నాయని, వాటి వల్ల ట్రాఫిక్కు, విద్యార్థులకు ఇబ్బందులు కలుగుతున్నాయని వాటిని ఇతర ప్రదేశాలకు మార్చాలని అధికారులను ఆదేశించారు. ఉప్పరపల్లి కెనాల్, కిష్టాపూర్ కెనాల్, రామాయంపేట కెనాల్ పనులను పూర్తిచేయాలని సూచించారు. కార్యక్రమంలో మిషన్ భగీరథ ఎస్ఈ వెంకట్రెడ్డి, డీఏఓ సురేశ్, కుమార్, కరుణ్కుమార్, డీఈలు విజయ్ ప్రకాశ్, వెంకటేశ్, బుచ్చయ్య, నరసింహారావు, రాజేంద్రప్రసాద్, స్రవంతి, ఏడీఏ బాబునాయక్, డీఎల్పీఓ లత తదితరులు పాల్గొన్నారు.


