సీఎం ఫొటో మరిచిన అధికారులు
చేర్యాల(సిద్దిపేట): నూతనంగా ఎన్నికైన చేర్యాల మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్, కౌన్సిలర్ల బాధ్యతల స్వీకరోత్సవ కార్యక్రమం శుక్రవారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో అధికారికంగా జరిగింది. ఈ సందర్భంగా మున్సిపల్ అధికారులు స్వాగత ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. మొదట ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో స్థానిక ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి, ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డి ఫొటోలతో పాటు చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్, కౌన్సిలర్ల ఫొటోలు మాత్రమే వేశారు. ఇది చూసిన పలువురు సీఎం, మంత్రుల ఫొటోలు లేకుండా, ప్రొటోకాల్ పాటించకుండా ఫ్లెక్సీ ఏర్పాటు చేయడం ఏమిటని చర్చించుకున్నారు. ఇది గమనించిన అధికారులు వెంటనే తొలిగింగి, సీఎం, మంత్రులతో కూడిన మరో ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. ఈ విషయం స్థానిక సోషల్ మీడియా గ్రూపుల్లో చక్కర్లు కొట్టడంతో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీనిపై కలెక్టర్ ఎలా స్పందిస్తారో, బాధ్యులపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే.
బాధ్యతల స్వీకరణ
చేర్యాల మున్సిపల్ చైర్పర్సన్గా ముస్త్యాల అరుణ, వైస్ చైర్పర్సన్గా మేడిశెట్టి ఉమ శుక్రవారం అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. మున్సిపల్ ఎన్నికల పోలింగ్, ఓట్ల లెక్కింపు అనంతరం ఈ నెల 16న చైర్పర్సన్, వైస్ చైర్ పర్సన్లుగా ఎన్నికై ప్రమాణ స్వీకారం చేసిన వారు.. శుక్రవారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలోని చాంబర్లో అర్చకుల మంత్రోచ్ఛరణల మధ్య స్థానిక ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి సమక్షంలో అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్లను ఎమ్మెల్యే పల్లా అభినందించి మాట్లాడుతూ చేర్యాలను అన్నిరంగాల్లో అభివృద్ధి చేసేలా కలిసి పని చేయాలని సూచించారు. అనంతరం బాద్యతలు చేపట్టిన చైర్ పర్సన్, వైస్ చైర్ పర్సన్, కౌన్సిలర్లకు ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ నాగేందర్, కౌన్సిలర్లు నిమ్మ సుప్రజ, బూదరి సురేష్, వీరబత్తిని సదానందం, ఎజాజ్ అహ్మద్, మేనేజర్ ప్రభాకర్, సీనియర్ అసిస్టెంట్ కృష్ణ, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
వెంటనే తేరుకుని మరో ఫ్లెక్సీ ఏర్పాటు
మున్సిపల్ చైర్పర్సన్
బాధ్యతల స్వీకారోత్సవంలో ఘటన


