గజ్వేల్: ట్రిపుల్ఆర్ నిర్మాణంలో భూములను కోల్పోతున్న బాధితులకు అండగా ఉంటామని కలెక్టర్ హైమావతి అన్నారు. సోమవారం గజ్వేల్లోని ఐఓసీ (ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్)లో జగదేవ్పూర్ మండలం చేబర్తి, అలిరాజపేట, పీర్లపల్లి, ఇటిక్యాల గ్రామాలకు చెందిన ట్రిపుల్ఆర్ భూబాధితులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ట్రిపుల్ఆర్ నిర్మాణంతో భారీ అభివృద్ధి జరగనుందని చెప్పారు. భూములు ఇచ్చేందుకు రైతులు ముందుకు రావడం శుభపరిణామని పేర్కొన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వారికి అందాల్సిన నష్ట పరిహారం త్వరగా అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. సమావేశంలో గజ్వేల్ ఆర్డీఓ చంద్రకళ, తహాశీల్దార్ నిర్మల తదితరులు పాల్గొన్నారు.
22న ఆయిల్పామ్ ఫ్యాక్టరీ ప్రారంభం
నంగునూరు(సిద్దిపేట): నర్మేటలో నిర్మించిన ఆయిల్పామ్ ఫ్యాక్టరీని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఈనెల 22న ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా సోమవారం కలెక్టర్ హైమావతి, పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాళ్ల అధికార యంత్రాంగంతో సమీక్షించారు. రైతుమేళా స్టాల్, హెలిప్యాడ్, బహిరంగ సభ, పార్కింగ్ స్థలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆయిల్పామ్ ఫ్యాక్టరీతో పాటు సిద్దిపేటలో జిల్లా జైలును సీఎం ప్రారంభిస్తారని తెలిపారు. నర్మేట ఫ్యాక్టరీలో వ్యవసాయ, ఉద్యానవన, పశు సంవర్ధకశాఖ ఆధ్వర్యంలో 120 స్టాళ్లను ఏర్పాటు చేసి మూడు రోజుల పాటు రైతు మేళా నిర్వహించాలన్నారు. ప్రతిరోజు మూడు నుంచి ఐదు వేల మంది రైతులు వచ్చే అవకాశం ఉందని, భోజన, తాగునీటి వసతి, వైద్యశిబిరం, తాత్కాలిక టాయిలెట్లను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. పోలీస్ కమి రష్మీ పెరుమాళ్ల భద్రతా ఏర్పాట్లలో భాగంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తామన్నారు. కార్యక్రమంలో అదనపు డీసీపీలు కుషాల్కర్, సుభాష్ చంద్రబోస్, ఆర్డీఓ సదానందం తదితరులు పాల్గొన్నారు.
ప్రజావాణికి 217 అర్జీలు
సిద్దిపేటరూరల్: ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా ప్రజల నుంచి స్వీకరించిన అర్జీలను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ కె.హైమావతి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించాలని కోరారు. వచ్చిన అర్జీలు పునరావృతం కాకుండా అధికారులు చొరవ చూపాలన్నారు. మొత్తం 217 అర్జీలు వచ్చాయి. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అబ్దుల్హమీద్, డీఆర్ఓ నాగరాజమ్మ, ఏఓ రాజ్కుమార్ తదితరులు పాల్గొన్నారు.
జిల్లా కలెక్టర్ హైమావతి


