● మీ చెంతనే ఫ్యాక్టరీ.. సాగు పెంచుదాం ● వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు
నంగునూరు(సిద్దిపేట): అన్నదాతలు అధిక లాభాలు గడించే ఆయిల్పామ్ పంటకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తున్నదని, సాగు విస్తీర్ణం పెంచాలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు పిలుపునిచ్చారు. నంగునూరు మండలం నర్మేటలో ఏర్పాటు చేసిన రైతు మహోత్సవాన్ని గురువారం మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, స్పీకర్ ప్రసాద్కుమార్, మంత్రులు వివేక్, శ్రీహరి, పొన్నం ప్రభాకర్, నాగేశ్వర్రావు, ఎమ్మెల్యేలు హరీశ్రావు, ప్రభాకర్రెడ్డి, ఎంపీ రఘునందన్రావు, ఎమ్మెల్సీలు యాదవరెడ్డి, దేశపతి శ్రీనివాస్, రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి, ఆయిల్ఫెడ్ చైర్మన్ రాఘవరెడ్డిలు ప్రారంభించారు. అనంతరం స్టాళ్లను పరిశీలించి ఏర్పాట్లపై ఆరా తీశారు. మంత్రి నాగేశ్వర్రావు మాట్లాడుతూ తెలంగాణకు అన్ని రకాలుగా అందుబాటులో ఉన్న సిద్దిపేట ప్రాంతంలో ఆయిల్ఫ్యాక్టరీ, రిఫైనరీ ఏర్పాటు చేస్తున్నామన్నారు. మంత్రి శ్రీహరి మాట్లాడుతూ రైతాంగంపై ప్రేమతో శాసన మండలి, శాసన సభాపతి పండగ పూట మీ వద్దకు వచ్చారన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ మూడు రోజుల పాటు నిర్వహించే రైతు మేళాకు చుట్టుపక్కల జిల్లాల రైతులు వచ్చి స్టాళ్లను పరిశీలించి అవగా
హన పెంచుకోవాలన్నారు. హుస్నాబాద్ నియోజక వర్గంలో ఆయిల్పామ్ పంటను సాగు చేయిస్తామన్నారు. ఎమ్మెల్యే హరీశ్రావు మాట్లాడుతూ ఆయిల్పామ్ సాగుకు అనుకూలంగా లేని ఈ ప్రాంతానికి కళేశ్వరం నీరు రావడంతోనే తేమ శాతం పెరిగి సాగుకు అనుకూలంగా మారిందన్నారు. ఎంపీ రఘునందన్రావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఎకరా ఆయిల్పామ్ సాగుకు ప్రతి యేటా రూ.4,200 రైతు అకౌంట్లో జమ చేస్తోందన్నారు. ప్రభాకర్రెడ్డి మాట్లాడుతూ ప్రారంభంలో ఆయిల్పామ్ సాగు చేయాలని చెబితేనే భయం వేసేదని, ఈ ప్రాంతానికి ఫ్యాక్టరీ రావడం సంతోషంగా ఉందన్నారు.
ఉప్పొంగిన ఉత్సాహం..
‘జిల్లాకు ఆయిల్పామ్ మొక్కను తెచ్చింది మీరు.. ఫ్యాక్టరీకి పునాది వేసింది మీరే’ అంటూ హరీశ్రావును చూసిన ఆనందంలో రైతులు జైకొట్టారు. రైతుల బాగు కోసం పాటు పడిన మీ వెంటే మేమంటూ ఉద్వేగం.. ఉత్సాహంతో ఆయన వెంట తిరుగుతూ షేక్హ్యాండ్ ఇచ్చేందుకు పోటీ పడ్డారు.
కాలువ వద్ద హరీశ్ సెల్ఫీ
కాలువల ద్వారా కాళేశ్వరం నీరు పారడంతో కార్యకర్తలతో కలిసి హరీశ్రావు సెల్ఫీ దిగి సంతోషం వ్యక్తం చేశారు. కేసీఆర్ కృషితో వేసవి కాలంలో నీరు పారుతూ రైతన్నల కళ్లలో అంతులేని ఉత్సాహం నెలకొందని ట్వీట్ చేశారు.


