రాష్ట్రస్థాయికి నాచగిరి ఖ్యాతి
వర్గల్(గజ్వేల్): సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం నాచగిరి దేవస్థాన పురోహితుడు యాయవరం నాగరాజుశర్మకు రాష్ట్రస్థాయి ఉగాది పురస్కారం వరించింది. గురువారం హైదరాబాద్ రవీంద్రభారతి వేదికగా దేవాదాయ, ధర్మాదాయశాఖ మంత్రి కొండా సురేఖ, కమిషనర్ హన్మంతరావు చేతుల మీదుగా పురస్కారం అందజేసి ఘన సన్మానం చేశారు. వర్గల్ మండలం వేలూరుకు చెందిన యాయవరం నాగరాజుశర్మ మూడు దశాబ్దాలుగా దేవస్థాన పురోహితునిగా సేవలందిస్తున్నారు. ఆయనకు రాష్ట్ర పురస్కారం వరించడం పట్ల ఆలయ చైర్మన్ రవీందర్గుప్తా, ఈఓ రంగాచారి, ధర్మకర్తలు, ఆలయ అర్చక పురోహితులు, సిబ్బంది అభినందనలు తెలిపారు. తనకు పురస్కారం దక్కడంపై నాగరాజుశర్మ సంతోషం వ్యక్తం చేశారు.


