మూగ యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి

- - Sakshi

(హుస్నాబాద్‌): ఓ మూగ యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. అయితే ఆ యువకుడి మృతిపై తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారంటూ ఆరోపిస్తున్నారు. ఎస్‌ఐ తాండ్ర వివేక్‌ తెలిపిన వివరాల ప్రకారం... మండలపరిధిలోని నర్సింహతండాకు చెందిన మాలోతు రాజు–లలిత దంపతులకు ముగ్గురు సంతానం. రెండేళ్ల కిందటే ఐదేళ్ల కుమార్తె అనారోగ్యంతో మృతి చెందింది. పెద్దకుమారుడు మాలోతు ఆంజనేయులు(17)పుట్టుకతోనే మూగవాడు. బుధవారం తండాలో బంధువుల వివాహ వేడుక జరిగింది.

మధ్యాహ్నం పెళ్లిలో భోజనం చేస్తున్న క్రమంలో ముగ్గురు భయపెట్టారని ఆంజనేయులు సైగల ద్వారా తన తల్లిదండ్రులకు వివరించాడు. రాత్రి 9గంటలు దాటినా ఇంటికి రాలేదు. చుట్టు పక్కల వెతకగా, ఎక్కడా ఆచూకీ దొరకలేదు. గురువారం తెల్లవారుజామున గౌరవెల్లి రిజర్వాయర్‌ సమీపంలో తమకున్న వ్యవసాయ క్షేత్రం దగ్గర కట్టవద్దకు వెళ్లి చూసేసరికి వేప చెట్టుకు ఆంజనేయులు శవం వేలాడుతూ ఉంది. విషయం తెలుసుకొని పలువురు సంఘటన స్థలానికి వచ్చారు. తండాకు చెందిన కిషన్‌కు రాజుకు కొంతకాలంగా భూతగదాలు నడుస్తున్నాయి.

ఇటీవల ఇద్దరిపై కేసులు నమోదు అయ్యాయి. అయితే పాతకక్షల నేపథ్యంలో తమ కుమారుడిని హతమార్చారని ఆంజనేయులు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. విషయం తెలుసుకున్న జెడ్పీటీసీ సభ్యురాలు భూక్యమంగ హుస్నాబాద్‌ ప్రభుత్వ ఆస్పత్రిలో ఆంజనేయులు మృతదేహం వద్ద నివాళులు అర్పించారు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమో దు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ తెలిపారు.

Read latest Sangareddy News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top