రెండు రోజులుగా జిల్లాలో ముసురు
జిల్లాలో గతేడాది వానాకాలం సీజన్లో 1.57 లక్షల ఎకరాల్లో వరి సాగైంది. ఈసారి ఎల్నినో ప్రభావంతో వరి విస్తీర్ణం 88 వేల ఎకరాలకు పరిమితమవుతుందని వ్యవసాయశాఖ అంచనా వేసింది. ఇప్పటి వరకు 37 వేల ఎకరాల్లో వరి నాట్లు పడ్డాయి. ఈ రెండు రోజులుగా వర్షాలు పడటంతో రైతులు సాగు పనులు వేగవంతం చేశారు. ప్రధానంగా ఆందోల్, నారాయణఖేడ్, కల్హేర్, కంగ్టి, సిర్గాపూర్ తదితర మండలాల్లో వరి నాట్లు పడుతున్నాయి. గుమ్మడిదల మండలంలో మాత్రం రైతులు వెదజల్లే పద్దతిలో వరి వేసుకుంటున్నారు. జిన్నారం మండలంలోని కొన్ని గ్రామాల్లోనూ ఇదే పద్దతిని అవలంభిస్తున్నారు. దీంతో వరి సాగు విస్తీర్ణం 50 వేల ఎకరాలకు మించి పోయే అవకాశాలున్నట్లు వ్యవసాయశాఖ అంచనా వేస్తోంది.
గట్టెక్కనున్న పంటలు
రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు పత్తి, సోయా వంటి వంటలు ప్రాణం పోసుకున్నాయి. ఎల్నినో ప్రభావంతో తీవ్ర వర్షభావ పరిస్థితుల మధ్య పంటల సాగు ప్రారంభమైంది. కానీ ఈ వర్షాలతో పంటలకు ఎంతో మేలు జరిగిందని రైతులు హర్షం వ్య క్తం చేస్తున్నారు. నాలుగు కీలక దశల్లో పంటలకు నీ రు అవసరం ఉంటుంది. ఇప్పటి వరకు రెండు కీలక దశలు దాటిందని వ్యవసాయశాఖ అధికారులు పే ర్కొంటున్నారు. మరో పది రోజులు ఇలాగే వర్షాలు కురిస్తే పంటలు చేతికందుతాయని చెబుతున్నారు.
రోజంతా చిరుజల్లులు
గురువారం ఉదయం నుంచి సాయంత్రం 5 గంటల వరకు జిల్లాలో చిరుజల్లులు కురిశాయి. అత్యధికంగా నాగల్గిద్దలో 1.8 సెం.మీలు, వట్పల్లిలో 1.7 సెం.మీ, సిర్గాపూర్లో 1.6 సెం.మీ, పుల్కల్, నిజాంపేట్లో 1 సెం.మీ చొప్పున వర్షపాతం నమోదైంది. బుధవారం మాత్రం పలు మండలాల్లో భారీ వర్షం కురిసింది. సిర్గాపూర్లో 4.8 సెం.మీ, కంగ్టిలో 4.7 సెం.మీ, గుమ్మడిదల, మొగుడంపల్లి, కల్హేర్లలో 2.2 సెం.మీ చొప్పున, నిజాంపేట, మనూరుల్లో 2 సెం.మీ చొప్పున, నారాయణఖేడ్లో 1.8 సెం.మీ వర్షపాతం నమోదైంది. మిగిలిన అన్ని మండలాల్లో ఒక సెం.మీ చొప్పున వర్షం కురిసింది. కాగా, వర్షాకాలం ప్రారంభమైన జూన్ 1 తేదీ నుంచి ఇప్పటివరకు జిల్లా సాధారణ వర్షపాతం 302 మి.మీలు కాగా, ఇప్పటి వరకు 304 మి.మీల వర్షపాతం రికార్డయింది.
జిల్లాలో వరినాట్లు వేస్తున్న మహిళలు
జిల్లాలో గత రెండు రోజులుగా పెట్టిన ముసురుతో వరి నాట్లు ముమ్మరమయ్యాయి. ఇప్పటి వరకు బోరు బావుల వద్ద పాక్షిక విస్తీర్ణంలో పరిమితమైన రైతులు, ఇప్పుడు పూర్తి విస్తీర్ణంలో నాట్లు వేసుకుంటున్నారు. తుపాను ప్రభావంతో జిల్లాలో దాదాపు అన్ని మండలాల్లో బుధ, గురువారం రోజంతా ముసురు పెట్టింది. దీంతో అన్నదాతల ఆశలు చిగురించాయి.
– సాక్షిప్రతినిధి, సంగారెడ్డి
బోరుబావుల వద్ద నాట్లు వేగవంతం చేసిన రైతులు
గుమ్మడిదల, జిన్నారంలో వెద సాగు
ప్రాణం పోసుకున్న పత్తి, సోయా పంటలు


