కోరేది కొండంత.. దాచేది పిసరంత! | Young Indians want early retirement but arenot saving enough | Sakshi
Sakshi News home page

కోరేది కొండంత.. దాచేది పిసరంత!

Jun 7 2025 5:34 AM | Updated on Jun 7 2025 5:40 AM

Young Indians want early retirement but arenot saving enough

నెలకు రూ.లక్ష పెన్షన్‌ కావాలంటున్నారు

ఆదా చేస్తున్నది మాత్రం జీతంలో 15% లోపే

సంపాదన ఉన్నా సేవింగ్స్‌ పట్టని ప్రైవేటు ఉద్యోగులు

ముందస్తు రిటైర్‌మెంట్‌ కోరుతున్న యువత

‘గ్రాంట్‌ థోర్న్‌టన్‌ భారత్‌’సర్వేలో వెల్లడి

సంపాదించుకోవాలి.. త్వరగా పదవీ విరమణ చేయాలి.. ఇదీ భారతీయ యువత ఆలోచన. ముఖ్యంగా 25 ఏళ్లలోపు వయసున్న ఉద్యోగుల్లో.. 43 శాతం మంది 45–55 సంవత్సరాలకే రిటైర్మెంట్‌ తీసుకోవాలని భావిస్తున్నారు. ముందస్తు పదవీ విరమణ కోరుకుంటున్నప్పటికీ 75% మంది తమ ఆదాయంలో కేవలం 1–15% మాత్రమే పెన్షన్‌ పథకాలకు కేటాయిస్తున్నారు. దేశంలో ప్రైవేటు రంగంలో పనిచేసేవారు, వ్యక్తిగతంగా ఉపాధి పొందుతున్నవారిపై ప్రముఖ ప్రొఫెషనల్‌ సేవల సంస్థ ‘గ్రాంట్‌ థోర్న్‌టన్‌ భారత్‌’చేసిన సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. – సాక్షి, స్పెషల్‌ డెస్క్‌

ప్రైవేటు రంగంలో పనిచేస్తున్నవారిలో.. తమ పదవీ విరమణ తరువాత ఆశిస్తున్న ఆదాయానికి, వారి ఆర్థిక ప్రణాళికలకు మధ్య చాలా అంతరం ఉంది. అంటే రిటైర్‌ అయ్యాక ఆశిస్తున్న ఆదాయం ఎక్కువ.. కానీ అందుకు తగ్గట్టుగా చేయాల్సిన పొదుపు మాత్రం తక్కువ అన్నమాట. ‘ఇండియాస్‌ పెన్షన్‌ ల్యాండ్‌స్కేప్‌: ఏ స్టడీ ఆన్‌ రిటైర్మెంట్‌ రియాలిటీ అండ్‌ రెడీనెస్‌’పేరుతో ‘గ్రాంట్‌ థోర్న్‌టన్‌ భారత్‌’సంస్థ ఒక నివేదిక విడుదల చేసింది.

2024 ఆగస్టు–సెప్టెంబర్‌ మధ్య నిర్వ­హించిన సర్వే ఆధారంగా దీన్ని రూపొందించారు. ఇందులో పాల్గొన్నవారిలో 79 శాతం మంది వయసు 25–54 ఏళ్లలోపే. 88 శాతం మంది ప్రైవేటు రంగంలో పనిచేస్తున్నవారు కాగా, 5 శాతా­నికిపైగా వ్యక్తిగతంగా ఉపాధి పొందుతున్నవారు. వీరిలో వార్షికాదాయం రూ.5–10 లక్షలు ఉన్న­వారు 12.6 శాతం కాగా, రూ.10–20 లక్షల మధ్య ఉన్నవారు 25.25 శాతం. రూ.20–30 లక్షల మధ్య ఆదాయార్జన­పరులు 27.25 శాతం. రూ.40 లక్షలకుపైన ఆదాయం ఉన్నవారు 30.23 శాతం.

సంపాదన ఉన్నప్పటికీ..
56% మంది సంవత్సరానికి రూ.20 లక్షల కంటే ఎక్కువ సంపాదిస్తున్నప్పటికీ.. చాలా తక్కువ మందే పెన్షన్‌పథకాల్లో పెట్టుబ­డులు పెడుతు­న్నారు. అధిక ఆదాయం సంపాదించేవారిలో 30% మంది నెలకు రూ.2 లక్షల కంటే ఎక్కువ పెన్షన్లు ఆశిస్తున్నారు. సంవత్సరానికి రూ.40 లక్షల కంటే ఎక్కువ సంపాదించేవారిలో 58% మంది పదవీ విరమణ కోసం వారి జీతంలో 1–15% మాత్రమే కేటాయిస్తు­న్నారు. రూ.20–30 లక్షల ఆదాయం ఆర్జించేవారిలో 75% మంది పెన్షన్‌కోసం తమ వేతనంలో 6–20% సమకూరుస్తున్నారు. సర్వేలో పాల్గొన్నవా­రిలో సగం మందికి అటల్‌ పెన్షన్‌ యోజన గురించి అవగాహన లేదు. పెన్షన్‌ మొత్తాల­ను ఎలా లెక్కిస్తారో 30% మందికి తెలియ­దు. ఆర్థిక అక్షరాస్యత పెరగాల్సిన అవసరాన్ని ఈ గణాంకాలు చెబుతున్నాయి.

రూ.లక్ష పెన్షన్‌ కావాలి
55% మంది నెలకు రూ.లక్ష కంటే ఎక్కువ పెన్షన్‌ ఆశిస్తున్నారు. అయితే 11% మంది మాత్రమే తమ ప్రస్తుత పెట్టుబడులు ఈ అంచనాలను అందుకోవడానికి సరిపోతాయని నమ్ముతున్నారు. ప్రభుత్వ మద్దతు ఉన్న పెన్షన్‌ప్రణాళికల పట్ల సుమారు 39% మంది మొగ్గుచూపు­తున్నారు. అధిక ముప్పు, అధిక రాబడి ఉన్న ప్రణాళికలు ముఖ్యంగా యువతను ఆకర్షిస్తున్నాయి. 25 ఏళ్లలోపు వారిలో 31% మంది ఈ పథకాలపై ఆసక్తిని వ్యక్తం చేస్తున్నారు. నిజానికి నెలకు రూ.లక్ష పెన్షన్‌ పొందడానికి 30 ఏళ్ల వ్యక్తి 12% వార్షిక రాబడి, 6.75% యాన్యుటీ రేటును ఊహిస్తూ 60 సంవత్సరాల వయస్సు వరకు నెలకు రూ.6,000 పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది.

సంప్రదాయ పెన్షన్‌..: 56% మంది 55–65 సంవత్సరాల మధ్య పదవీ విరమణ పొందాలని ఆలోచిస్తున్నారు. 45–50 ఏళ్ల మధ్య రిటైరైపోవాలని సుమారు 11 శాతం మంది చెప్పారు. 75% మంది తమ జీతంలో 15% లోపే పదవీ విరమణ పథకాలకు కేటాయిస్తున్నారు. అత్యధికులు ఇప్పటికీ సంప్రదాయ పెన్షన్‌ సాధనాలవైపే మొగ్గు చూపుతున్నారు. 35% మంది ఉద్యోగుల ప్రావిడెంట్‌ ఫండ్‌ (ఈపీఎఫ్‌) ఎంచుకుంటున్నారు.

తరువాత గ్రాట్యుటీ, జాతీయ పెన్షన్‌ సిస్టమ్‌ (ఎన్‌పీఎస్‌) మీద ఆధారపడుతున్నారు. అయితే, గ్రాట్యుటీ మాత్రమే సరిపోదని 99% మంది భావిస్తున్నారు. 32% మంది మాత్రమే ఎన్‌పీఎస్‌ పనితీరుతో సంతృప్తి చెందారు. ఈపీఎఫ్‌కు ప్రజాదరణ ఉన్నప్పటికీ దాని పనితీరుపై కేవలం 46% మంది మాత్రమే సంతృప్తిగా ఉన్నారు. పబ్లిక్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ (పీపీఎఫ్‌) విషయంలో కూడా చాలా తక్కువ మందే ఆసక్తి చూపారు. పదవీ విరమణ తర్వాత స్థిర ఆదాయాన్ని అందించడంలో మంచివే అయినప్పటికీ 76% మంది యాన్యుటీ పథకాలలో పెట్టుబడి పెట్టడం లేదని నివేదిక వివరించింది.

పొంచి ఉన్న సంక్షోభం..: శ్రామిక జనాభా పెరుగుతున్న కొద్దీ ఆశిస్తున్న పదవీ విరమణ అవసరాలు, వాస్తవ పొదుపుల మధ్య అంతరం స్పష్టంగా కనిపిస్తోంది. దీన్ని తగ్గించడానికి వ్యక్తుల జీవిత అవసరాలకు అనుగుణంగా ఉండే బలమైన పెన్షన్‌ వ్యవస్థ అవసరం. అత్యధికులు తమ గ్రాట్యుటీ మొత్తాలు సరిపోవని భావిస్తున్నారు. తక్కువ వార్షిక పెట్టుబడుల రేటు కారణంగా పదవీ విరమణ తర్వాత వచ్చే హామీ ఆదాయం విషయంలో అనిశ్చితి ఉంది. బలమైన ఆర్థిక విద్య, మరింత ఆకర్షణీయమైన పెన్షన్‌ ఉత్పత్తులు, అధిక పొదుపులను ప్రోత్సహించడానికి విధాన పరమైన సంస్కరణలు రాకపోతే రాబోయే దశాబ్దాలలో పదవీ విరమణ పొందిన వ్యక్తుల కుటుంబాల్లో సంక్షోభం తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement