మహేశ్వరం: ప్రజలందరి భాగస్వామ్యంతోనే డ్రగ్స్ భూతాన్ని కట్టడి చేయగలమని మహేశ్వరం డీసీపీ నారాయణరెడ్డి పేర్కొన్నారు. మండల కేంద్రంలోని ఎంపీడీఓ సమావేశ హాలులో మంగళవారం నషాముక్త్ భారత్ అభియాన్ ఆధ్వర్యంలో విలేకరులకు వర్క్షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మాదక ద్రవ్యాల సరఫరా, సంబంధిత కార్యకలాపాలను అరికట్టడమే లక్ష్యంగా ఎస్ఐడీ, ఆక్టోపస్, సీఐఎస్ఎల్, ఈగల్ ఫోర్స్ వంటి బలమైన ప్రత్యేక బలగాలతో పాటు స్థానిక పోలీసు యంత్రాంగం నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు. నివారణ చర్యలు ఇళ్లు, బడుల్లోనే మొదలుకావాలన్నారు. మాదకద్రవ్య రహిత భారత్ నిర్మాణం దిశగా ఇలాంటి కార్యక్రమాలను ప్రోత్సహించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. మాదక ద్రవ్యాలకు సంబంధించిన కేసులను నివేదించేటప్పుడు కచ్చితత్వాన్ని, సున్నితత్వాన్ని దృష్టిలో పెట్టుకోవాలని సూచించారు. అంతకు ముందు ఈగల్ ఫోర్స్, పీఐబీ, పోలీసులు, ఎంపీడీఓ, పలువురు అధికారులు డ్రగ్స్ నివారణలో విలేకరుల పాత్రపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఈగల్ ఫోర్స్ పోలీస్ సూపరింటెండెంట్ రావుల గిరిధర్, పీఐబీ హైదరాబాద్ జాయింట్ డైరెక్టర్ డా.మానస్ కృష్ణకాంత్, కమ్యూనికేషన్ అధికారి వర్గంటి గాయత్రి, మహేశ్వరం ఏసీపీ జానకిరెడ్డి, సీఐ రాఘవేందర్రెడ్డి, ఎంపీడీఓ శారదమ్మ పాల్గొన్నారు.
మహేశ్వరం డీసీపీ నారాయణరెడ్డి


