ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): హైదరాబాద్లో ఈనెల 18న జరిగే గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు(జీఆర్ఎంబీ) సమావేశం ఎజెండా నుంచి తెలంగాణ ప్రాజెక్టుల అనుమతుల రద్దు అంశాన్ని తొలగించాలని కరీంనగర్ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ డిమాండ్ చేశారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య నివాసంలో గురువారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణలోని పలు ప్రాజెక్టుల అనుమతులు రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదించడం, ఆ అంశాన్ని సమావేశం ఎజెండాలో చేర్చడం ఆందోళన కలిగించే విషయమన్నారు. ప్రాజెక్టుల అనుమతులు రద్దు చేస్తే రాష్ట్ర సాగునీటి రంగంపై తీవ్ర ప్రభావం పడే ప్రమాదం ఉందన్నారు. ఈ అంశంపై రాష్ట్రానికి చెందిన బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలు వెంటనే ప్రధానమంత్రిని కలిసి ప్రాజెక్టుల అనుమతుల రద్దు అంశాన్ని ఎజెండా నుంచి తొలగించేలా ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్ చేశారు. జీఆర్ఎంబీ సమావేశాన్ని బహిష్కరించాలనడం లేదని, ఎజెండాలోని అంశాన్ని తొలగించాలని కోరుతున్నామన్నారు. తెలంగాణ ప్రయోజనాలకు సంబంధించిన కీలకమైన అంశాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నాలు చేయకుండా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని సూచించారు. బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, మాజీ రాష్ట్ర చైర్మన్ గూడూరి ప్రవీణ్, సెస్ డైరెక్టర్ కృష్ణహరి, పీఏసీఎస్ చైర్మన్ కృష్ణారెడ్డి, సర్పంచ్ నర్సింహులు, సీనియర్ నాయకులు రాఘవరెడ్డి, రాజిరెడ్డి, నర్సింహారెడ్డి, కిషన్, జక్కుల నాగరాజు, మురళి తదితరులు పాల్గొన్నారు.
ఎజెండా నుంచి అంశాన్ని తొలగించాలి
మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్


