నాణ్యమైన భోజనం అందించాలి
విద్యార్థుల తల్లిదండ్రుల ఆందోళన
సిరిసిల్ల అర్బన్: చిన్నబోనాలలోని సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయంలో పురుగుల అన్నం పెడుతున్నారంటూ విద్యార్థుల తల్లిదండ్రులు శనివారం ఆందోళనకు దిగారు. పాఠశాల ప్రిన్సిపాల్ జె.జె.థెరిస్సాను నిలదీశారు. పురుగుల అన్నం పెడుతుండడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సరైన నీటి వసతి లేదని, బాత్రూమ్లు సరిగ్గా లేవని, మరుగుదొడ్ల నుంచి దుర్వాసన వస్తోందని, కిటీకీల డోర్లు సరిగ్గా లేవన్నారు. పిల్లలకు సమయానికి భోజనం పెట్టడం లేదని, తరచూ భోజనంలో పురుగులు వస్తున్నా పట్టించుకోకపోవడంపై ప్రిన్సిపాల్పై మండిపడ్డారు. సెలవు రోజుల్లో పాఠశాలకు వస్తే గేటు వద్ద సెక్యూరిటీ, అటెండర్లు దురుసుగా ప్రవర్తిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై ప్రిన్సిపాల్ జె.జె.థెరిస్సాను వివరణ కోరగా పురుగుల అన్నం పెడుతున్నారనే విషయం తన దృష్టికి రాలేదన్నారు. పేరెంట్స్ కమిటీ సభ్యులపై ఎవరూ దురుసుగా ప్రవర్తించడం లేదన్నారు. విద్యార్థులకు ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. పేరెంట్స్ కమిటీ సభ్యులు పంగ రవి, మల్యాల దేవయ్య, రాజేశ్వరి, రేవతి పాల్గొన్నారు.
సమస్యలు పరిష్కరించండి
చిన్నబోనాల హాస్టల్లో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని బీఆర్ఎస్వీ రాష్ట్ర నాయకుడు కంచర్ల రవిగౌడ్ కోరారు. విద్యార్థులు పడుతున్న ఇబ్బందులు తెలుసుకొని శనివారం బోనాలకు వెళ్లి పరిశీలించి మాట్లాడారు. సమస్యలు వెంటనే పరిష్కరించకపోతే బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఆరెల్లి వినయ్కుమార్, సదుల శేఖర్ తదితరులు పాల్గొన్నారు.


