వేములవాడ: అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకుని రావాలని విప్ ఆది శ్రీనివాస్ అధికారులను కోరారు. నియోజకవర్గ పరిధిలో సీఆర్ఆర్, ఎంఆర్ఆర్ గ్రాంట్లు తదితర పనుల పురోగతిపై మంగళవారం తన నివాసంలో నిర్వహించిన సమీక్షలో అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. పనులు ఎక్కడ ఆలస్యమవుతున్నాయో గుర్తించి వాటిని వేగవంతం చేయాలని, నాణ్యతలో రాజీ పడకుండా గడువులోగా పూర్తి చేయాలన్నారు. అభివృద్ధి పనులు పూర్తి చేయడం ద్వారా ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుందన్నారు. సిరిసిల్ల ఈఈ సుదర్శన్రెడ్డి, వేములవాడ డీఈ విష్ణువర్ధన్, చందుర్తి డీఈ పవనకుమారి, కోరుట్ల డీఈ సత్యనారాయణ, ఏఈలు మనోహర్, అంజయ్య, సాయితేజ, జగదీశ్, సుచరిత్ తదితరులు పాల్గొన్నారు.
పక్కా ప్రణాళికతో పట్టణాభివృద్ధి
భూమిపూజ చేస్తున్న చైర్పర్సన్ కళ తదితరులు
సిరిసిల్లటౌన్: పక్కా ప్రణాళికతో సిరిసిల్ల పట్టణ సర్వతోముఖాభివృద్ధి చేపడుతామని మున్సి పల్ చైర్పర్సన్ జిందం కళ అన్నారు. స్థానిక 19వ వార్డులో సీసీరోడ్డు పనులకు భూమిపూజ చేసి మాట్లాడారు. గత మున్సిపల్ పాలకవర్గం సమయంలో సమస్యను ఎమ్మెల్యే కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లగా రాజ్యసభ సభ్యుడు డి.దామోదర్రావు ప్రత్యేక నిధుల ద్వారా ఈ రోడ్డు నిర్మాణానికి రూ.6 లక్షలు విడుదల చేయించారన్నారు. మరో రూ.3 లక్షలు మున్సిపల్ జనరల్ ఫండ్తో పూర్తిస్థాయిలో రోడ్డు నిర్మిస్తున్నామన్నారు. రాబోయే రోజుల్లో అన్ని వార్డుల్లో రోడ్లు, మురికి కాలువలు పూర్తిస్థాయిలో నిర్మించేలా ప్రణాళిక చేపడతామన్నారు. మున్సిపల్ కమిషనర్ ఎండీ ఖాదిర్ పాషా, కౌన్సిలర్ బొద్దుల శ్రీనివాస్, డీఈ వాణి, ఏఈ నరసింహస్వామి తదితరులు పాల్గొన్నారు.
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): డ్రగ్స్, సైబర్ నేరాలు, రోడ్డు ప్రమాదాల నివారణలో విద్యార్థులు కీలక పాత్ర పోషించాలని సిరిసిల్ల డిఎస్పీ నాగేంద్రచారి సూచించారు. మంగళవారం ఎల్లారెడ్డిపేట పోలీస్స్టేషన్ పరిధి రాచర్లగొల్లపల్లిలోని రాచర్ల జూనియర్ కళాశాలలో నిర్వహించిన అవగాహన సదస్సులో మాట్లాడారు. యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండి తమ లక్ష్యాల సాధనపై దృష్టి సారించాలన్నారు. ఎవరైనా మాదకద్రవ్యాల విక్రయం, వినియోగం గురించి తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. సైబర్ మోసాలకు గురైన వెంటనే 1930 హెల్ప్లైన్కు ఫోన్ చేయడంతో పాటు సమీప పోలీస్ స్టేషన్, సైబర్ క్రైం పోర్టల్లో ఫిర్యాదు చేయాలన్నారు. ట్రాఫిక్ నియమాలు పాటించడం ద్వారా రోడ్డు ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని తెలిపారు. చదువుతో పాటు క్రమశిక్షణ, సామాజిక బాధ్యతను అలవర్చుకోవాలని సూచించారు. ఎల్లారెడ్డిపేట సర్కిల్ సీఐ వెంకటేశ్, ఎస్సై రాహుల్రెడ్డి, ప్రిన్సిపాల్, అధ్యాపకులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
సిరిసిల్ల: జిల్లావ్యాప్తంగా మంగళవారం శ్రీముసురుశ్రీవర్షం కురిసింది. అత్యధికంగా వేములవాడలో 43.8 మిల్లీ మీటర్ల వర్షం పడగా.. రుద్రంగి 20.3, చందుర్తి 16.2, వేములవాడరూరల్ 26.6, బోయినపల్లి 15.7, సిరిసిల్ల 30.4, కోనరావుపేట 27.4, వీర్నపల్లి 21.6, ఎల్లారెడ్డిపేట 25.7, గంభీరావుపేట 10.7, ముస్తాబాద్ 19.1, తంగళ్లపల్లి 31.1, ఇల్లంతకుంట 14.0 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. జిల్లాలో సగటు వర్షపాతం 23.3 మి.మీ నమోదైంది. కాగా ముసురువానతో సిరిసిల్లలోని తోతట్టుప్రాంతాలు మురికిమయమయ్యాయి. మురికి కాల్వల్లోని నీరు రోడ్లపైకి రావడంతో కంపువాసన వ్యాపించింది. వేములవాడలోనూ ఇలాగే ముంపు ప్రాంతాల్లో కంపు కొట్టింది.


