వేములవాడఅర్బన్: ప్రజలు తమ ఇళ్ల పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని, నీటి నిల్వ పాత్రలను వారానికి ఒకసారి పూర్తిగా ఖాళీ చేసి శుభ్రం చేయాలని డీఎంహెచ్వో ఏంజెలా అల్ఫ్రెడ్ అన్నారు. వేములవాడ మండలం చీర్లవంచలో మంగళవారం నిర్వహించిన డ్రై డే కార్యక్రమాలను పరిశీలించారు. గ్రామంలోని నివాస ప్రాంతాలు, నీరు నిల్వ ఉండే ప్రదేశాలు, ఇంటింటి పరిసరాలను తనిఖీ చేసి, దోమల నివారణ చర్యలను క్షేత్రస్థాయిలో సమీక్షించారు. డెంగీ, మలేరియా, చికున్గున్యా వ్యాధుల నివారణకు ప్రతీ మంగళ, శుక్రవారాలు తప్పనిసరిగా డ్రై డే నిర్వహించాలన్నారు. జ్వరం, తలనొప్పి, ఒళ్లునొప్పులు వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే సమీప ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించాలన్నారు. కార్యక్రమంలో ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలు తదితరులు పాల్గొన్నారు.


