ఇది ఇల్లంతకుంట మండలం పొత్తూరు వద్ద రైతు పోలే ఎల్లయ్య పొలం. వర్షాలు కురుస్తాయనే ఆశతో వరినారు పోశాడు. వర్షాలు రాక.. నీటి తడి లేక నారుమడి పగుళ్లు బారింది. నారును కాపాడుకునేందుకు రైతు కొడుకు రాజు రెండు బకెట్లతో నారుమడికి ఇలా నీళ్లు పోశాడు. నారు దక్కితే.. వర్షాలు పడితే.. నాట్లు వేయవచ్చని రైతు ఆశ. కళ్ల ముందే నారుమడి పగుళ్లు బారి ఎండిపోతుంటే చూడలేక చి‘వరి’ ప్రయత్నాలు చేస్తున్నారు. కాగా, జిల్లాలోని 11 మండలాల్లో లోటు వర్షపాతం రికార్డు అయింది. జిల్లాలో సాధారణ వర్షపాతం 219.2 మిల్లీ మీటర్లు కాగా.. ఇప్పటి వరకు సగటు వర్షపాతం 139.2గా నమోదైంది. రుద్రంగి, చందుర్తి, వేములవాడరూరల్, బోయినపల్లి, వేములవాడ, సిరిసిల్ల, ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట, ముస్తాబాద్, తంగళ్లపల్లి, ఇల్లంతకుంట మండలాల్లో లోటు వర్షపాతం ఉంది. కోనరావుపేట, వీర్నపల్లి మండలాల్లో సాధారణ వర్షపాతం రికార్డు అయింది. జిల్లాలో బోర్లలో నీరున్న రైతులు వరినాట్లు వేస్తుండగా, చెరువు పారుకం, బావులపై ఆధారపడిన వారు వర్షాల కోసం నిరీక్షిస్తున్నారు. – సిరిసిల్ల


