వేములవాడ: ప్రతీ ఉద్యోగి భక్తులతో మర్యాదగా వ్యవహరించి ఆలయాల ప్రతిష్ఠను మరింత పెంపొందించాలని సిటా డైరెక్టర్ డా.చిలకపాటి విజయరాఘవాచార్యులు, ఎంవీ రామారావు సూచించారు. స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ (సిటా) నిర్వహిస్తున్న మూడు రోజుల శిక్షణ కార్యక్రమంలో భాగంగా రెండోరోజు మంగళవారం ఉదయం జరిగిన సెషన్లో దేవాలయ సంస్కృతి–ఆగమ శాస్త్రం అంశంపై వివరించారు. మధ్యాహ్నం రెండో సెషన్లో పూజా విధానంలో లోపాలు– గరుడ పురాణం అంశంపై ప్రసంగించారు. పూజా విధానాల్లో జరిగే పొరపాట్లు, వాటి వల్ల కలిగే దోషాలు, వాటి నివారణ, అర్చకులు తప్పనిసరిగా పాటించాల్సిన శాస్త్రోక్త విధానాల గురించి చెప్పారు. ఈవో రమాదేవి, అర్చకులు, ఉద్యోగులు పాల్గొన్నారు.
క్రమశిక్షణ పాటించాలి
సిరిసిల్లటౌన్: ఆలయ ఉద్యోగులు క్రమశిక్షణతో విధులు నిర్వర్తించాలని సిటా డైరెక్టర్ విజయ రాఘవాచార్యులు అన్నారు. మంగళవారం శ్రీశాల శ్రీలక్ష్మీవేంకటేశ్వరస్వామిని దర్శించుకుని మాట్లాడారు. దేవదాయశాఖ పరిధిలోని నియమ, నిబంధనలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలన్నారు. పూజా విధానాల విశిష్టతను కాపాడుతూ భక్తులకు ఇబ్బంది కలగకుండా సేవలు అందించాలని అవగాహన కల్పించారు. ఈవో డీవీ మారుతిరావు, కె.కాంతారెడ్డి రాజయ్య, అర్చకులు పాల్గొన్నారు.


