ఓపీ
విభాగంలో
ధర్నా చేస్తున్న జూడాలు
ఒంగోలు టౌన్: న్యాయమైన తమ డిమాండ్లను పరిష్కరించి, స్టైఫండ్ పెంచే వరకు సమ్మెను కొనసాగిస్తామని జూనియర్ డాక్టర్లు స్పష్టం చేశారు. వైద్యుల సమ్మెను ప్రభుత్వం పట్టించుకోకపోవడం బాధాకరమని జూడాల సంఘ ఉపాధ్యక్షురాలు ఫైజ్ ఖాన్ ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం జూనియర్ డాక్టర్లు మెడికల్ కాలేజీ నుంచి జీజీహెచ్ దీక్షా శిబిరం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం జీజీహెచ్ ఓపీ విభాగం వద్ద బైఠాయించి ధర్నా చేపట్టారు. ‘వియ్ వాంట్ జస్టిస్’ అంటూ వారు చేసిన నినాదాలతో జీజీహెచ్ ప్రాంగణం దద్దరిల్లింది. సాయంత్రం కాలేజీ ఆవరణలోని వాటర్ ట్యాంక్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఫైజ్ ఖాన్ మాట్లాడుతూ.. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటిన ప్రస్తుత పరిస్థితుల్లో 30 శాతం స్టైఫండ్ పెంచాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. అయితే ప్రభుత్వం మాత్రం కేవలం 3 శాతం మాత్రమే పెంచుతామని, ఇక నుంచి రెండేళ్లకోసారి కాకుండా ఏటా 3 శాతం చొప్పున ఇస్తామని చెప్పడం సరికాదన్నారు. ఈ లెక్కన 30 శాతం పెంపుదల కోసం మరో పదేళ్లు వేచి చూడాల్సి వస్తుందని, ఇది ముమ్మాటికీ అన్యాయమని మండిపడ్డారు. ప్రభుత్వం మొండివైఖరి వీడి జూనియర్ డాక్టర్ల సమస్యలపై సానుకూలంగా స్పందించాలని కోరారు. ఈ ఆందోళనలో జూడా సంఘ అధ్యక్షుడు భార్గవ సాయి, కార్యదర్శి క్రిష్ కాంత్, నాయకులు ఆదిత్య, రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
అరకొర సేవలు.. రోగులకు తిప్పలు
జూనియర్ డాక్టర్ల సమ్మె ప్రభావంతో ఒంగోలు సర్వజన ఆస్పత్రి(జీజీహెచ్)లో వైద్య సేవలు తీవ్రంగా కుంటుపడ్డాయి. జూడాలకు ప్రత్యామ్నాయంగా విధులకు హాజరవుతున్న పీహెచ్సీలు, ఇతర విభాగాల వైద్యులు నామమాత్రంగా సేవలు అందిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నిత్యం రోగులతో కిటకిటలాడే క్యాజువాలిటీ విభాగంలో ఒకరిద్దరు వైద్యులు మాత్రమే విధులు నిర్వహిస్తుండటంతో రోగులకు అవస్థలు తప్పడం లేదు. ఫలితంగా ఆస్పత్రికి వచ్చే రోగుల సంఖ్య బాగా తగ్గింది. ఓపీ విభాగం వెలవెలబోతుండగా, నిత్యం రద్దీగా ఉండే గైనకాలజీ వార్డులోనూ కాన్పుల సంఖ్య గణనీయంగా పడిపోయింది.
ప్రభుత్వ తీరుపై జూనియర్ డాక్టర్ల ఆగ్రహం
మెడికల్ కాలేజీ నుంచి జీజీహెచ్ వరకు భారీ ర్యాలీ, ధర్నా
వియ్ వాంట్ జస్టిస్ నినాదంతో దద్దరిల్లిన ఆస్పత్రి ప్రాంగణం


