ఒంగోలు సిటీ: ఒంగోలులోని జవహర్ నవోదయ పాఠశాలలో 6వ తరగతికి అడ్మిషన్లకు నిర్వహించే ప్రవేశ పరీక్ష దరఖాస్తుకు గడువును ఈ నెల 10వ తేదీ వరకు పొడిగించారని ప్రిన్సిపల్ సి.శివరాం శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రకాశం జిల్లా పరిధిలో 5వ తరగతి చదువుతున్న విద్యార్థులు జవహర్ నవోదయ పాఠశాలలో అడ్మిషన్లు పొందవచ్చన్నారు. ఈ అడ్మిషన్లకు నిర్వహించే ప్రవేశ పరీక్షకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. 2027–28వ సంవత్సరానికి 6వ తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకునేందుకు ఆగస్టు 10వ తేదీ వరకు గడువు పొడిగించారన్నారు. ఈ నెల 11, 12 తేదీల్లో దరఖాస్తు పత్రాల్లో ఏమైనా తప్పులుంటే సవరణకు అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
వలేటివారిపాలెం: మండలంలోని మాలకొండలో వెలసిన మాల్యాద్రి లక్ష్మీనరసింహ స్వామి వారి దేవస్థానం శనివారం రూ.11,31,191 వచ్చినట్లు ఆలయ ఈఓ పీ శ్రీనివాసులు రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. కుంకుమార్చన ద్వారా రూ.24,480, తలనీలాలు రూ.39,450, ప్రత్యేక దర్శనం రూ.3,92,300, రూం అద్దెలు రూ.24,420, లడ్డు ప్రసాదాలు రూ.2,19,170, అన్నదానానికి రూ.2,28,106లు, ఇతర విరాళాలు కలిపి ఆదాయం రూ.11,31,191 వచ్చినట్లు చెప్పారు.
మార్కాపురం: మార్కాపురం జిల్లా ఆర్టీసీ డిస్ట్రిక్ట్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసరుగా జీ వెంకటేశ్వర్లు శనివారం అధికార బాధ్యతలు స్వీకరించారు. నెల్లూరు ఆర్టీసీ డిపో మేనేజరుగా పనిచేస్తూ పదోన్నతిపై మార్కాపురం జిల్లా డీపీటీఓగా నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆయన్ను డిపో మేనేజరు లావణ్య, అసిస్టెంట్ డిపో మేనేజరు సత్యనారాయణ (ఫైనాన్స్) సిబ్బంది కలిసి అభినందనలు తెలిపారు.
వెలిగండ్ల (కనిగిరిరూరల్): వెలిగండ్ల మండలం కొటాలపల్లి స్వర్ణ సచివాలయ వెల్ఫేర్ ఉద్యోగి వెంకట కృష్ణపై దాడి చేసిన ఘటనలో ఆరుగురు టీడీపీ నాయకులపై కేసు నమోదైంది. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు విధులకు ఆటంకం కలిగించి, అతనిపై దాడి చేసి గాయపరచిన టీడీపీ మండల పార్టీ అధ్యక్షుడు కే ఇంద్రభూపాల్ రెడ్డి, మరో ఐదుగురిపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.


