ఒంగోలు వన్టౌన్: రోడ్డు ప్రమాదాల నివారణకు సంబంధిత శాఖలన్నీ సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ పి.రాజాబాబు ఆదేశించారు. మంగళవారం ప్రకాశం భవనంలో కలెక్టర్, ఎస్పీ వి.హర్షవర్ధన్ రాజు అధ్యక్షతన జిల్లా రోడ్డు భద్రతా కమిటీ సమావేశం జరిగింది. గత నివేదికను డీటీసీ ఆర్.సుశీల వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఇటీవల ఒంగోలు, అద్దంకి, సంతమాగులూరులో ప్రమాద ప్రాంతాలను తాము సందర్శించామని, క్షేత్రస్థాయిలో అందరూ సమిష్టిగా పనిచేస్తూ వాహనదారులకు భద్రతా నియమాలపై నిరంతరం అవగాహన కల్పించాలన్నారు. ఎస్పీ మాట్లాడుతూ.. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది జనవరిజూలై మధ్య ప్రమాద మరణాలు 18.5%, ప్రమాదాలు 3.5% తగ్గాయన్నారు. అధికారుల స్పందన సమయం 8 నిమిషాలకు తగ్గిందన్నారు. ట్రాఫిక్ ఉల్లంఘనలకు 39,182 మందికి రూ.2.38 కోట్లు, డ్రంక్ అండ్ డ్రైవ్లో 1,869 మందికి రూ.కోటి జరిమానా విధించి 67 మందికి జైలు శిక్ష పడేలా చేశామన్నారు. 9 వేల ఎల్ఈడీ లైట్లు తొలగించామన్నారు. సమావేశంలో డీఎంహెచ్ఓ వెంకటేశ్వర్లు, ఎన్టీఆర్ వైద్యసేవ కోఆర్డినేటర్ హేమంత్, ఆర్అండ్బీ ఎస్ఈ రవి నాయక్, పంచాయతీరాజ్ ఎస్ఈ అశోక్, ఆర్టీసీ ఆర్ఎం సత్యనారాయణ, జాతీయ రహదారుల సంస్థ అధికారులు, జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలు, రవాణా శాఖ అధికారులు పాల్గొన్నారు.


