● సంఘటన స్థలంలో విస్తృతంగా తనిఖీలు
రాచర్ల: మండలంలోని జేపీ చెరువు సమీపంలోని అంబచెరువు, తెట్టెమడుగు అటవీ పరిసర ప్రాంతంలోని లోతువాగులో శుక్రవారం ఓ పెద్దపులి కళేబరం వెలుగు చూసిన విషయం తెలిసిందే. గిద్దలూరు రూరల్ సీఐ జె.రామకోటయ్య, రాచర్ల ఎస్సై ఎం.శివతో పాటు గిద్దలూరు, గుండ్లకమ్మ రేంజ్ ఆఫీసర్ వీరస్వామి కలిసి శనివారం పెద్దపులి కళేబరం లభించిన ప్రదేశాల్లో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. పెద్దపులి అనారోగ్యంతో మృతి చెందిందా లేదా కలుషిత నీరు తాగడం ద్వారా మృతి చెందిందా.. పెద్దపులి మరణం వెనుక వేటగాళ్ల ప్రమేయం ఉందా అన్న కోణాల్లో కేసు దర్యాప్తు ప్రారంభించారు. గిద్దలూరు డిప్యూటీ డైరెక్టర్ ప్రాజెక్టు టైగర్ (డీడీపీటీ) అధికారి నిషాకుమారితో పాటు నంద్యాల జిల్లా ఆత్మకూరు ఫారెస్టు డిప్యూటీ డైరెక్టర్ ప్రాజెక్టు టైగర్ (డీడీపీటీ) అధికారి విగ్నేష్ అప్పోవ్ అధ్వర్యంలో పెద్దపులి కళేబరం లభ్యమైన ప్రదేశం నుంచి యానాదుల కాలనీతో పాటు జేపీ చెరువులో డాగ్ స్క్వాడ్తో తనిఖీలు చేపట్టారు. పెద్దపులి కళేబరానికి నిర్వహించిన పోస్టుమార్టానికి సంబంధించిన అధారాలతో అటవీశాఖ అధికారులు, పోలీసుల సమన్వయంతో వివిధ కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది.


