అద్దంకి: నార్కెట్పల్లి – అద్దంకి – మేదరమెట్ల(నామ్) రహదారిపై తరచూ సంభవిస్తున్న రోడ్డు ప్రమాదాల నివారణకు తక్షణ చర్యలు తీసుకోనున్నట్లు కలెక్టర్ పి.రాజాబాబు తెలిపారు. గురువారం ఎస్పీ హర్షవర్థన్ రాజు, రవాణా శాఖ అధికారులతో కలిసి అద్దంకి పట్టణంతో పాటు సంతమాగులూరు మండలంలోని అడ్డరోడ్డు తదితర ప్రాంతాల్లోని బ్లాక్ స్పాట్లను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నామ్ రహదారిలో ప్రమాదకరంగా ఉన్న కూడళ్ల వద్ద డ్రోన్ ద్వారా సర్వేలు నిర్వహించి అవసరమైన రక్షణ చర్యలు చేపడతామన్నారు. రోడ్లపై వాహనాలను నిలిపి రవాణాకు ఆటంకం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు, అవసరమైతే ఆ వాహనాలను సీజ్ చేస్తామని హెచ్చరించారు. జనావాసాలు ఉండే ప్రాంతాల్లో పీఏ సిస్టం ద్వారా వాహనదారులను అప్రమత్తం చేయాలన్నారు. రోడ్లపై ఆక్రమణలు లేకుండా చూడాలని, ఫుట్పాత్లను ఆక్రమించకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కూడళ్ల వద్ద సూచికలు, స్పీడ్ లిమిట్ బోర్డులు ఏర్పాటు చేయాలని, శింగరకొండ మలుపు వద్ద తారు రోడ్డు వేయాలని అధికారులకు సూచించారు. ఎస్పీ హర్షవర్థన్ రాజు మాట్లాడుతూ.. రోడ్లు, ఫుట్పాత్లపై షాపులు లేకుండా పోలీసు సిబ్బంది నిరంతర పర్యవేక్షణ చేయాలన్నారు. హైవే నుంచి సర్వీస్ రోడ్లలోకి వెళ్లే ప్రదేశాల్లో ఆక్రమణలకు తావులేకుండా చూడాలని స్పష్టం చేశారు. గ్రామ కూడళ్ల వద్ద మైక్ల ద్వారా వాహనదారులు, పాదచారులను అప్రమత్తం చేయాలన్నారు. కార్యక్రమంలో డీటీసీ సుశీల, అద్దంకి మున్సిపల్ కమిషనర్ రవీంద్ర, ఆర్అండ్బీ ఎస్ఈ నాయక్, ఎక్స్ప్రెస్ హైవే అధికారులు తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ రాజాబాబు, ఎస్పీ హర్షవర్థన్రాజు
అద్దంకి, సంతమాగులూరు అడ్డరోడ్డులో బ్లాక్ స్పాట్ల పరిశీలన


