డాక్టర్‌ వేధిస్తున్నాడని ఏఎన్‌ఎం ఆత్మహత్యాయత్నం | - | Sakshi
Sakshi News home page

డాక్టర్‌ వేధిస్తున్నాడని ఏఎన్‌ఎం ఆత్మహత్యాయత్నం

Jul 4 2023 12:44 AM | Updated on Jul 4 2023 1:38 PM

ఏఎన్‌ఎం దేవికాబాయిని పరామర్శిస్తున్న లంబాడీ సంఘం నాయకులు  - Sakshi

ఏఎన్‌ఎం దేవికాబాయిని పరామర్శిస్తున్న లంబాడీ సంఘం నాయకులు

డాక్టర్‌ తనను మానసికంగా వేధిస్తున్నాడని ఏఎన్‌ఎం వైద్యశాలలో ఉన్న యాంటీబయోటిక్‌ సిరప్‌ మోతాదుకు మించి తాగి ఆత్మహత్యా యత్నం

యర్రగొండపాలెం: డాక్టర్‌ తనను మానసికంగా వేధిస్తున్నాడని ఏఎన్‌ఎం వైద్యశాలలో ఉన్న యాంటీబయోటిక్‌ సిరప్‌ మోతాదుకు మించి తాగి ఆత్మహత్యా యత్నం చేసిన సంఘటన పుల్లలచెరువు మండలంలోని నాయుడుపాలెం పీహెచ్‌సీలో సోమవారం జరిగింది. నాయుడుపాలెం ఆరోగ్య కేంద్రం సబ్‌సెంటర్‌లో ఏఎన్‌ఎంగా విధులు నిర్వర్తిస్తున్న దేవికాబాయిని ఆ వైద్యశాల డాక్టర్‌ కంచర్ల నాగార్జునగౌడ్‌ వేధింపులకు గురిచేస్తున్నాడని, వైద్యశాల వద్దకు, పుల్లలచెరువులో జరిగే కార్యక్రమాల్లో హాజరయ్యేందుకు తన భర్త మోటారుబైక్‌పై తీసుకొని రావటాన్ని డాక్టర్‌ అభ్యంతరం తెలిపేవాడని, అనుచితంగా ప్రవర్తించేవాడని ఆమె ఆరోపించింది.

కొన్ని రోజులుగా ఆయన వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకొని వైద్యశాలలో ఉన్న సిరప్‌ తాగానని ఆమె తెలిపింది. సంఘటన జరిగిన వెంటనే తన తోటి సిబ్బంది వెంటనే యర్రగొండపాలెంలోని ప్రభుత్వ వైద్యశాలలో చేర్పించారు. డాక్టర్‌పై వెంటనే చర్యలు తీసుకోవాలని లంబాడీ సంక్షేమ సంఘం నాయకులు, ఏఎన్‌ఎం బంధువులు డిమాండ్‌ చేశారు.

గత ఏప్రిల్‌ నెలలో స్థానిక మాచర్ల రోడ్డులోని ఆంజనేయస్వామి గుడివద్ద నడుచుకుంటూ పోతున్న ఒకరిని డాక్టర్‌ తన కారుతో ఢీకొట్టిన కేసు యర్రగొండపాలెం పోలీస్‌ స్టేషన్‌లో ఉందని వారు తెలిపారు. డాక్టర్‌ వేధింపులకు తాను ఆత్మహత్యా యత్నం చేసినట్లు స్థానిక పోలీసులకు ఏఎన్‌ఎం దేవికాబాయి వాంగ్మూలం ఇచ్చింది. కేసు నమోదు చేసి పుల్లలచెరువు పోలీస్‌ స్టేషన్‌కు తరలిస్తున్నట్లు ఎస్సై జి.కోటయ్య తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement