సాక్షి, తాడేపల్లి : ఏపీ గంజాయి స్టేట్గా మారిపోయిందని.. పోలీసులతోనే గంజాయిని రవాణా చేసే దుస్థితికి తెచ్చారంటూ వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి నాగ మల్లీశ్వరి మండిపడ్డారు. గురువారం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. వంద రోజుల్లో గంజాయి నిర్మూలిస్తామన్న హోంమంత్రి ఎక్కడ ఉన్నారంటూ నిలదీశారు. లిక్విడ్ రూపంలో కూడా గంజాయి విచ్చలవిడిగా దొరుకుతోంది. ఇప్పటికే 70 లక్షల లీటర్ల లిక్విడ్ పట్టుబడింది. గంజాయి డాన్ సోహెల్ని పోలీసుల నుంచి తప్పించిందెవరు?’’ అంటూ నాగ మల్లీశ్వరి ప్రశ్నించారు.
‘‘హోంమంత్రి సొంత నియోజకవర్గంలోనే విచ్చలవిడిగా గంజాయి దొరుకుతోంది. చంద్రబాబు సొంత నియోజకవర్గంలోనూ గంజాయి విక్రయాలు జరుగుతున్నాయి. హోంమంత్రితో పోలీసులతో కూడా తప్పు చేయిస్తున్నారు. అత్యంత అసమర్థ మంత్రిగా హోంమంత్రి చరిత్రలో నిలిచిపోయారు. వైఎస్ జగన్ హయాంలో గంజాయి సాగుపై యుద్ధం చేశారు. ఆపరేషన్ పరివర్తన్ పేరుతో పెద్ద ఎత్తున చైతన్యం తెచ్చారు. ప్రత్యామ్నాయ పంటల సాగు వైపు నడిపించారు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక మళ్ళీ గంజాయి విచ్చలవిడిగా సాగవుతోంది’’ అంటూ మలీశ్వరి ధ్వజమెత్తారు.
‘‘గంజాయిని నిర్మూలించామంటున్న హోంమంత్రి మాతో చర్చకు రాగలరా?. హోంమంత్రికి నిత్యం వైఎస్ జగన్పై విషం చిమ్మటం తప్ప మరో పనిలేదు. సోహెల్ పోలీస్ స్టేషన్ నుండి పారిపోతే ఇప్పటి వరకు పట్టుకోలేదు. ఇదీ హోంమంత్రి పనితీరు. హోంమంత్రి అనిత దగ్గరకు ఫైల్ వెళ్తే ఐదు రోజులపాటు చూడరు. ఇది ప్రభుత్వమే చేయించుకున్న సర్వేలో తేలిన అంశం. ఇలాంటి వారి పాలనలో రాష్ట్రం ఇంకేం బాగుపడుతుంది?’’ అంటూ నాగ మల్లీశ్వరి ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: పంచదార్ల కొండపై వైఎస్సార్సీపీ పోరాటానికి దిగొచ్చిన ప్రభుత్వం


