సాక్షి, గుంటూరు: పొన్నూరు ఆలయంలో అమ్మవారి మంగళసూత్రం మాయం ఘటనపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అసలు దొంగల్ని పట్టుకోకుండా.. పూజారులను సస్పెండ్ చేశారంటూ మండిపడుతున్నారు. పైగా కొత్త మంగళసూత్రం సమర్పించే విషయంలోనూ స్పష్టత లేకుండా పోయింది. ఈ క్రమంలో.. గురువారం అమ్మవారికి తానే కొత్త మంగళసూత్రం సమర్పించారు పొన్నూరు నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇంఛార్జి అంబటి మురళి. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వంపై, స్థానిక ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
ఇది రాజకీయాలు మాట్లాడాల్సిన సమయం కాదు. కానీ, తప్పడం లేదు. 14వ తేదీన అమ్మవారి మంగళసూత్రం పోయింది. మంగళసూత్రం లేకుండానే వరలక్ష్మి వ్రతం చేయించారు. ఇది అశుభం. మంగళసూత్రాన్ని ఎలా సమకూరుస్తారో ప్రభుత్వం ప్రకటించలేదు. దేవదాయ శాఖ, రెవెన్యూ యంత్రాంగం ఇప్పటివరకూ స్పందించలేదు. ప్రభుత్వం స్పందించడం లేదు.
అమ్మవారి మెడలో పూలదండలు తీసే సమయంలో మంగళసూత్రం పోయిందని కబుర్లు చెబుతున్నారు. మంగళసూత్రాన్ని చేయించి గుట్టుచప్పుడు కాకుండా అమ్మవారికి వేయాలని ఆలయ అధికారి బసవ శంకర్ చూశాడు. అలాంటప్పుడు ఈవో, సీనియర్ అసిస్టెంట్ లపై చర్యలు ఎందుకు తీసుకోలేదు. అమాయకులైన పూజారులనే ఎందుకు సస్పెండ్ చేశారు?.. దొంగ ఎవరో తెలుసు... కావాలనే బయట పెట్టలేదు. ఇవాళ మంగళసూత్రాలు ఇచ్చాం. నాను తాడు సెప్టెంబర్ 3వ తేదిన అందిస్తాం అని అంబటి మురళి పేర్కొన్నారు.
పరువు నష్టం నోటీసులపై స్పందన
ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర రాజ్యాంగేతర శక్తిగా మారాడు. నాపై పరువు నష్టం దావా వేశాడు. రూ. 5 కోట్లకు నోటీసులు పంపించారు. ఆయన రాజకీయ జీవితాన్ని సెకనుకు ఐదు పైసలుగా లెక్క కట్టాడు. ఆ ఐదు పైసలు నేనే ఇస్తాను. పాపాల భైరవుణ్ణి శిక్షించవా తల్లి అని అమ్మవారిని అంబటి మురళి వేడుకున్నారు.
పూజారుల ఉసురు తగులుతుంది: ఆరే శ్యామల
మంగళసూత్ర సమర్పణ కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి ఆరే శ్యామల అన్నారు. ‘‘అర్చకులను దొంగతనంలో భాగస్వాములను చేస్తున్నారు. దొంగతనం జరిగిన విషయం కూడా ఎమ్మెల్యేకు తెలియదా?. పూజారుల ఉసురు తగులుతుంది. దొంగను పట్టుకోవాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వపైనే ఉంది’’ అని అన్నారామె.


