ఏపీకి ప్రత్యేక హోదా వాగ్దానాన్ని కేంద్రం నిలబెట్టుకోవాలి: ఎంపీ అవినాష్‌ | YSRCP MP Avinash Demand Special For AP In Lok sabha | Sakshi
Sakshi News home page

ఏపీకి ప్రత్యేక హోదా వాగ్దానాన్ని కేంద్రం నిలబెట్టుకోవాలి: ఎంపీ అవినాష్‌

Aug 6 2024 7:30 PM | Updated on Aug 6 2024 7:35 PM

YSRCP MP Avinash Demand Special For AP In Lok sabha

సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్‌ సాక్షిగా ఏపీకి ఇచ్చిన ప్రత్యేక హోదా వాగ్దానాన్ని కేంద్ర ప్రభుత్వం నిలబెట్టుకోవాలని అన్నారు వైఎస్సార్‌సీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి. లోక్‌సభలో ఫైనాన్స్‌ బిల్లుపై చర్చలో భాగంగా అవినాష్‌ రెడ్డి మాట్లాడుతూ.. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నోసార్లు ప్రధాని నరేంద్ర మోదీని కోరారని తెలిపారు. కడపలో స్టీల్ ప్లాంట్ నిర్మిస్తామన్న విభజన చట్టంలోని హామీని అమలు చేయాలని కోరారు. విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ను వెంటనే ప్రారంభించాలి

వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కేంద్రాన్ని ఎంపీ అవినాష్‌ కోరారు. భారత్ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తయారవుతున్నా పేదలు-ధనికుల మధ్య అంతరాలు పెరుగుతున్నాయని అన్నారు. పేదలు ధనికులుగా మారినప్పుడే ఇది అర్థవంతంగా ఉంటుందన్నారు. 10 శాతం మంది ధనికుల చేతుల్లో 77 శాతం దేశ సంపద ఉంటే.. 90% జనాభా చేతిలో 23% సంపద మాత్రమే ఉందని తెలిపారు. ఈ అంతరాలను తొలగించేందుకు ప్రభుత్వం ఖచ్చితమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.

‘దేశంలో ఆదాయపు పన్ను రేట్లు ఎక్కువగా ఉన్నాయి. ఆరోగ్య భీమా 25 వేలకే ఐటిడి కింద పరిమితం చేశారు. కానీ రోజురోజుకు వైద్య ఖర్చులు పెరిగిపోతున్నాయి. ఆరోగ్య బీమాను లక్ష రూపాయల వరకు మినహాయించాలి. కొత్త పన్ను విధానం వల్ల ప్రజలు ప్రోత్సాహకాలకు దూరమవుతున్నారు. దీనివల్ల పేద మధ్యతరగతి ప్రజలపై భారం పడుతుంది. 

చేనేతకారులు ఉపయోగించే ముడి సరుకులపై ఐదు శాతం జీఎస్టీని రద్దు చేయాలి. ఫిషింగ్ నెట్స్ పై జిఎస్టిని రద్దు చేయాలి. అన్ని పంటలకు కనీస మద్దతు ధరను ప్రకటించాలి. వ్యవసాయ రంగాన్ని ఆదుకోవాలి. వ్యవసాయ యంత్రాలపై జిఎస్టిని మినహాయించాలి. ఆరోగ్య బీమా, జీవిత బీమా లపై 18 శాతం జీఎస్టీని ఉపసంహరించాలి’ అని తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement