రైతులకు లాభం రావడం టీడీపీకి ఇష్టం లేదు

Ysrcp Mla Kilaru Fires on Dulapalla Naredra, TDP - Sakshi

తాడేపల్లి: టీడీపీ సీనియర్‌ నేత, గుంటూరు జిల్లా పొన్నూరు మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్‌ సంగం డెయిరీ రైతులను నిలువు దోపిడీ చేశారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే కిలారు రోశయ్య ఆయనపై ధ్వజమెత్తారు. మూత పడిన డైరీలను తెరిపించే కార్యక్రమం మా ప్రభుత్వం చేస్తుంటే అచ్చెన్నాయుడు విమర్శలు చేస్తున్నారు. అసలు డైరీల గురించి మాట్లాడే అర్హత టీడీపీకి లేదు. బషీర్ బాగ్ ఘటన ఇప్పటికీ ఎవరూ మర్చిపోలేదు, అసలు రైతుల గురించి మాట్లాడే హక్కు మీకు ఎక్కడిది అని ప్రశ్నించారు. రైతు భరోసాతో రైతులను అదుకుంటున్న వ్యక్తి సీఎం వైఎస్ జగన్ అని అన్నారు. 

ఆముల్ సంస్థకు కట్టబెడుతున్నాం అంటున్నారు... కానీ సంగం డెయిరీలో ఎమీ జరిగిందో మాత్రం బయటికి చెప్పరు. రైతులు స్థాపించిన సంగం డెయిరీకి దొడ్డి దారిన ధూళిపాళ్ల చైర్మన్ అయిన సంగతి అందరికీ తెలుసు. దాన్ని సొంత వ్యాపార సంస్థగా మార్చుకున్నారు...వచ్చిన లాభాలను రైతులకు చెందకుండా కాజేస్తున్న వ్యక్తి ధూళిపాళ్ల. డెయిరీలను నాశనం చేసింది మీరు కదా.. చిత్తూరు డెయిరీ నాశనం చేసి హెరిటేజ్ స్థాపించలేదా? అన్నారు. టీడీపీ అధినేత బాటలోనే ధూళిపాళ్ల నడిచారు. సంగం డెయిరీకి వచ్చిన లాభాలను ధూళిపాళ్ల వీరయ్య చౌదరీ ట్రస్ట్ కి బదిలీ చేసుకున్నది నిజం కాదా..? అని ప్రశ్నించారు. 

ఒక్కో సొసైటీకి 40 వేలు లాభం వస్తే లక్షల రూపాయలు ట్రస్ట్ కి డొనేట్ చేస్తున్నారు. ట్రస్ట్ కింద ఒక కార్పొరేట్ ఆస్పత్రి కట్టి దానికి ట్రస్టీగా నరేంద్ర ఉన్నారు. డెయిరీ సొమ్ముతో ఆస్పత్రి కట్టి దానికి ట్రస్టీగా ఎలా ఉంటావ్ చెప్పాలని ప్రశ్నించారు. సంగం డెయిరీ పాలరైతులు నిలువున దోపిడీకి గురయ్యారు. వైఎస్ జగన్ రైతులకు రూ.4 ధర పెంచి మేలు చేశారు. నరేంద్ర, చంద్రబాబు లాంటి వాళ్ళు ఉంటే ఆముల్ సంస్థ ఆ స్థాయికి ఎదిగేది కాదు అని విమర్శించారు. అందుకే అక్కడ జరిగిన అక్రమాలను ఏసీబీ దృష్టికి తీసుకొచ్చా రైతులకు మేలు జరగాలని ఆముల్ తో ఒప్పందం చేసుకుంటే ఏదేదో మాట్లాడతారు. పాడి రైతుల లాభాల కోసం మూతపడిన వాటిని ఆముల్ కి అప్పజెప్తున్నాం. రైతులకు లాభం రావడం, మూతపడిన వాటిని తెరిపించడం టీడీపీ వారికి ఇష్టం లేదు అని మండిపడ్డారు.

చదవండి:

తిరుపతి ఉప ఎన్నిక: దిక్కుతోచని స్థితిలో టీడీపీ..

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top