
సాక్షి, విశాఖపట్నం: చంద్రబాబు మోసాలను ప్రజల్లోకి తీసుకువెళ్తామని అనకాపల్లి జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ అన్నారు. కూటమి ప్రభుత్వ ఏడాది వైఫల్యాలు, మోసాలపై ‘వెన్నుపోటు’ పుస్తకాన్ని వైఎస్సార్సీపీ నేతలు ఆదివారం ఆవిష్కరించారు. కన్న బాబురాజు, కంబాల జోగులు, అదీప్ రాజు, పెట్ల ఉమాశంకర్ గణేష్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ.. వైఎస్సార్సీపీ నేతలపై కూటమి సర్కార్ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని మండిపడ్డారు. చంద్రబాబు ప్రభుత్వం అక్రమ కేసులు పెడుతుంది. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే తప్పుడు కేసులు పెడుతున్నారు. ఏడాది కాలంలో లక్ష యాభై వేల కోట్ల అప్పు తప్ప చేసిందేమీ లేదు.. త్వరలో అక్రమ మైనింగ్పై కూడా పోరాటం చేస్తాం. వైఎస్ జగన్ చెప్పిన హామీలతో పాటు చెప్పని హామీలను కూడా అమలు చేశారని గుడివాడ అమర్నాథ్ గుర్తు చేశారు.
కూటమి మోసాలపై వెన్నుపోటు పుస్తక ఆవిష్కరణ.. విశాఖపట్నం వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఆదివారం జరిగింది. ఈ పుస్తకాన్ని ఎంపీ బాబురావు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి, కేకే రాజు, వాసుపల్లి గణేష్ కుమార్ తదితరులు ఆవిష్కరించారు.
అక్రమాల్లో చంద్రబాబు పీహెచ్డీ: గొల్ల బాబురావు
పేద ప్రజలను మోసం చేయడం.. అక్రమాలు చేయడంలో చంద్రబాబు వేయి పీహెచ్డీలు చేశాడు. వైఎస్ జగన్ సంక్షేమ పాలనను ప్రజలు మర్చిపోలేకపోతున్నారు. మోసం పోయాం అని గ్రహించి ప్రజలు మళ్లీ జగన్ను గెలిపించాలని అనుకుంటున్నారు. జగన్ అంటే నమ్మకం.. బాబు అంటే మోసం అని ప్రజలకు వివరించాలి.
హమీలు అమలు చేయడంలో చంద్రబాబు విఫలం: కేకే రాజు
ఇచ్చిన హామీలను అమలు చేయడంలో చంద్రబాబు వైఫల్యం చెందారు. వైఎస్ జగన్ రాష్ట్ర ప్రజలకు సంక్షేమ పాలన అందించారు. నాడు ఏడాదిలో జగన్ అన్ని పథకాలను అమలు చేశారు. జగన్ ఇచ్చిన మాట మీద నిలబడితే.. బాబు మోసం చేశాడు. ఎల్లో మీడియాలో ప్రతీ రోజూ అబద్దపు కథనాలు రాస్తున్నారు. హామీల గురించి ఎవరైనా మాట్లాడితే కేసులు పెడతామని లోకేష్ బెదిరిస్తున్నాడు.

అప్పులు చేయడం సంపద సృష్టించడమా?: వరుదు కల్యాణి
గతంలో మూడు సార్లు సీఎంగా చేసిన బాబు ఎప్పుడూ ఇచ్చిన హామీలు అమలు చేయలేదు. ప్రజలను బాబు మరోసారి మోసం చేశాడు. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారు. ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడం సరే.. మహిళలకు రక్షణ కల్పించలేకపోతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆడ పిల్లలగా పుట్టడమే పాపమా అన్నట్టు ఉంది. ప్రభుత్వ దృష్టి అంతా అమరావతి అవినీతిపైనే ఉంది. ఏడాదిలో జగన్ 90 శాతం హామీలు అమలు చేశారు. బాబు చేసిన మోసాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి.

కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగింది: వాసుపల్లి గణేష్ కుమార్
చంద్రబాబు ఒక్కడే ఎప్పుడూ జగన్ను ఢీ కొట్టలేడు. పవన్, బీజేపీని కలుపుకొని బాబు గెలిచాడు. జగన్కు 40 శాతం ఓట్లు ఉన్నాయి. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్సీపీ విజయం ఖాయం. లోకేష్ నాయకుడిగా ఎదగలేడు.. ఆయన నాయకత్వం ముందుకు సాగదు. సంపద సృష్టిస్తా అని అధికారంలోకి వచ్చి.. అప్పు చేసి తల్లికి వందనం ఇచ్చారు. అసెంబ్లీని రబ్బర్ స్టాంప్లా చేస్తున్నారు. ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని హరిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో గెలుపు అనంతరం జగన్ 30 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉంటారు. జగన్ మచ్చ లేని నాయకుడు.. ఆయన ఏ తప్పు చేయలేదు. నాయకులు, అధికారుల తప్పిదం వలన ఓడిపోయాం. కూటమి పాలనలో తప్పులు చేసిన వారు ఎక్కడున్నా తీసుకొస్తాం.