
కృష్ణాజిల్లా: 115 రోజులుగా వల్లభనేని వంశీని కూటమి ప్రభుత్వ పెద్దలు ఉద్దేశపూర్వకంగా జైల్లో ఉంచారని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. వంశీ మీద ఒక కేసు తర్వాత మరొకటి బనాయిస్తూ కక్ష సాధింపు చర్యలకు దిగారన్నారు. చంద్రబాబు,లోకేష్ యముడిపాత్రలో ఉంటే సతీ సావిత్రిలాగా వంశీని ఆయన భార్య కాపాడుకుంటోందన్నారు పేర్ని నాని. న్యాయస్థానంపై నమ్మకంతో ఆమె పోరాడుతోందని పేర్ని నాని తెలిపారు. వంశీ బయటకు రావడం, గన్నవరం ప్రతి గడపకు వెళ్లడం జరుగుతుందన్నారు. ఎప్పటికీ గన్నవరం నియోజకవర్గానికి వంశీనే నాయకత్వం వహిస్తారన్నారు పేర్ని నాని.
ఈరోజు(శనివారం) కృష్ణా జిల్లా వైఎస్సార్సీపీ అధ్వర్యంలో ‘ వెన్నుపోటు దినం’ నిరసన కార్యక్రమం పోస్టర్ ను ఆవిష్కరించారు. ఇందులో మాజీ మంత్రి పేర్ని నాని, మాజీ ఎమ్మెల్యేలు సింహాద్రి రమేష్ బాబు,కైలే అనిల్ కుమార్ , మచిలీపట్నం నియోజకవర్గ సమన్వయకర్త పేర్ని కిట్టు,పెడన వైసీపీ ఇంఛార్జి ఉప్పాల రాము, పెనమలూరు వైఎస్సార్సీపీ ఇంఛార్జి దేవభక్తుని చక్రవర్తి , గుడివాడ, గన్నవరం నియోజకవర్గ వైఎస్సార్సీపీ ముఖ్యనేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పేర్ని నాని మాట్లాడుతూ.. ‘అధికార మదం చూపించుకోవాలనే వంశీపై తప్పుడు ఆలోచనతో కేసుల మీద కేసులు పెట్టారు. 14 ఏళ్ల క్రితం వంశీ తనకు అన్యాయం చేశారని ఒకరు. 9 ఏళ్ల క్రితం వంశీ తనకు అన్యాయం చేశారని ఒకరు. వంశీ మీద ఒక కేసు తర్వాత మరో తప్పుడు కేసు బనాయిస్తున్నారు. దేవుడున్నాడు...న్యాయస్థానాల్లో న్యాయం దొరుకుతుందని ఆశతో ఉన్నాం.
ఎన్ని తప్పుడు కేసులుపెట్టినా అంతిమంగా న్యాయం దొరుకుతుంది పోరాడుతున్నాం. చంద్రబాబు, లోకేష్ మానవత్వాన్ని మరిచి దిగజారి వ్యవహరిస్తున్నారు. ఆరోగ్యం క్షీణించి వంశీని ఏదోఒకటి చేయాలని చూస్తున్నారు. చంద్రబాబు అరెస్ట్ అవ్వగానే అనారోగ్యం వస్తుంది. అచ్చెన్నాయుడు అరెస్ట్ అవ్వగానే ఫైల్స్ వస్తాయి..ఆపరేషన్ చేయించుకోవాలి. చంద్రబాబు ఆరోగ్యం నాశనమైందని కారణం చూపించి బెయిల్ పై బయటికొచ్చారు. జైలు నుంచి బయటికొచ్చాక ఒక్క రోజు కూడా ఆసుపత్రికి వెళ్లలేదు
చంద్రబాబు బెయిల్ పైన బయటికి వచ్చిన దగ్గర్నుంచి రోజూ చేసింది కుట్రరాజకీయాలే. ఈ ప్రభుత్వం పై పోరాడేందుకు వైఎస్సార్సీపీ కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారు. ధైర్యంగా ఈ కూటమి మోసాలను అడ్డుకునేందుకు రెడీగా ఉన్నారు. చంద్రబాబు తప్పుడు హామీలతో గెలిచి ప్రజలను మోసం చేస్తున్నాడు.
పిల్లల చదువుల పై కూడా రాజకీయాలు చేస్తున్నాడు. పిల్లల చదువుల కోసం తల్లిదండ్రులు తమ ఆస్తులను తాకట్టుపెట్టుకోవాల్సి వస్తోంది. జూన్ 4వ తేదీన గన్నవరంలో వెన్నుపోటు దినం నిరసన తెలియజేస్తాం.
రాష్టంలోని అన్ని ప్రాంతాల కంటే మిన్నగా గన్నవరంలో నిరసన చేపడతాం. వంశీ లేకపోయినా వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో నిరసనలో విజయవంతం చేస్తాం. దేవాలయాల ఆస్తులన్నీ టిడిపి నేతల చేతుల్లోకి పోతున్నాయ్. విద్యాశాఖ మంత్రికి మాటలెక్కువ చేతలు తక్కువ. పదవ తరగతి మూల్యాంకనమే ఆ శాఖామంత్రి పని తీరుకు నిదర్శనం’ అని పేర్ని నాని ధ్వజమెత్తారు.