విజయవాడ: గతంలో ఎన్నడూ లేని విధంగా ఏపీలో హత్యలు, అఘాయిత్యాల, అమానుషాలు, దాడులు, వివక్ష, వెలివేతలు కోకొల్లలుగా సాగుతున్నాయని మాజీ మంత్రి మేరుగు నాగార్జున ధ్వజమెత్తారు. సామాజిక అసమానతలు రెచ్చగొట్టేలా ఏపీలో పాలన సాగుతోందని మండిపడ్డారు. కూటమి పాలనలో శాంతి భద్రతలపై ఈరోజు(మంగళవారం, జూన్ 30వ తేదీ) విజయవాడలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో మేరుగ మాట్లాడారు.
ఏ ముఖ్యమంత్రి అయినా రాజ్యాంగానికి కట్టుబడి పనిచేయాలి. సామాజిక అసమానతలు రెచ్చగొట్టేలా ఏపీలో పాలన సాగుతోంది. పరిపాలనలో తన., మన బేధాలు పాటిస్తున్న వ్యక్తి చంద్రబాబు. చంద్రబాబు పాలన దుర్మార్గమైన పాలన. ముద్దాయిలుగా ఉన్న నేతలతో కలిసి పాలన చేస్తున్నారు. దళిత ప్రిన్సిపాల్ ను వేధించిన కూన రవికుమార్ పై ఇప్పటి వరకూ నో కేస్.
విజయనగరం జిల్లాలో ఎస్సీలు, బీసీల పై దాడులు చేస్తే నో కేస్. విశాఖ జిల్లాలో మహిళను వివస్త్రగా మార్చితే ఎమ్మెల్యే పై నో కేస్. డిప్యూటీ సీఎం ప్రాతినిధ్యం వహించే పిఠాపురంలో దళితులను వెలివేస్తే నో కేస్. కాకినాడలో ఎమ్మెల్యే పంతం నానాజీ దళిత ప్రిన్సిపల్ ను చెంపదెబ్బ కొడితే నో కేస్. రాజమండ్రిలో సాగర్ అనే దళిత యువకుడిని బట్టలిప్పి నిలబెడితే నో కేస్. సాయికృష్ణ , క్రాంతికుమార్ కుటుంబాలకు న్యాయం చేయాలి. దళిత మహిళ హోంమంత్రి అని చెప్పుకోవడానికి మాకు సిగ్గేస్తోంది’ అని పేర్కొన్నారు.


