సాక్షి, తాడేపల్లి: సాయికృష్ణ, క్రాంతికుమార్ మరణాలపై సీబీఐతో విచారణ జరపాలని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. పోలీసుల దుర్మార్గాలపై తమ పోరాటం ఆగదని తేల్చి చెప్పారు. సాయికృష్ణ ఇంటికి వైఎస్ జగన్ వెళ్లే వరకు ప్రభుత్వం ఎందుకు స్పందించలేదు అంటూ ప్రశ్నించారు.
‘‘గత నెల 28నే అడ్వకేట్ కనకదుర్గ ఫిర్యాదు చేశారు. అయినా సరే పోలీసులు ఎందుకు కేసు నమోదు చేయలేదు?. వైఎస్ జగన్ వెళ్తేగానీ సీఐ మీద కేసు నమోదు చేయరా?. లాకప్ డెత్ జరిగినట్టు ప్రభుత్వం అంగీకరించింది. సాయికృష్ణ పిన్ని కనకదుర్గ హైకోర్టులో పిల్ వేశారు. ఇక్కడ్నుంచే అసలు కథ ప్రారంభమైంది. సీఐ నాగరాజు మీద కేసు నమోదు చేసి సస్పెండ్ చేస్తే సరిపోదు. పేరిపోగు క్రాంతికుమార్ కూడా సీఐ టార్చర్ వలనే ఆత్మహత్య చేసుకున్నాడు. సాయికృష్ణ, క్రాంతికుమార్ మరణాల వెనుక సీఐతోపాటు చాలామంది అధికారులు ఉన్నారు. వారందరిపై కూడా చర్యలు తీసుకోవాలి’’ అని అంబటి రాంబాబు డిమాండ్ చేశారు.
‘‘సాయికృష్ణ చనిపోయిన ఫోటో, కాళ్ల మీద గాయాలు ఉన్న ఫోటోలు ఫేక్ అంటూ ప్రచారం చేస్తున్నారు. జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి అవన్నీ ఫేక్ ఫోటోలు అంటున్నారు. అవి ఫేక్ ఫోటోలు అయితే సాయికృష్ణను చూపించండి. నేను చూపినవి ఫేక్ ఫోటోలైతే నా మీద కేసు పెట్టుకోవచ్చు. తాము జనసేన పార్టీ అని సాయికృష్ణ కుటుంబ సభ్యులే చెప్పారు. అలాంటి కార్యకర్త ఇంటికెళ్లి కనీసం పరామర్శించలేదు. పైగా రాజీ చేయాలని చూడటం సిగ్గుచేటు. ఆ తల్లి అడిగిన సాయికృష్ణ భస్మం అయినా ఇవ్వండి. జనసేన నాయకులుగా ఉండి ఏం ప్రయోజనం?’’ అంటూ అంబటి దుయ్యబట్టారు.

‘‘మీకు చేతగాని పని మేము చేస్తే బురద జల్లుతారా?. సాయికృష్ణ కేసులో మిగిలిన పాత్రధారులంతా బయటకు రావాలి. పేరుపోగు క్రాంతి కుమార్ కుటుంబానికి కూడా న్యాయం చేయాలి. సాయికృష్ణ, క్రాంతి కుమార్ మరణాలపై సీబీఐ విచారణ చేయాలి. చంద్రబాబు.. సాయికృష్ణ కుటుంబాన్ని మాయ చేసి ఉండొచ్చు. కానీ పోలీసు వ్యవస్థ పనితీరు, ప్రభుత్వ పోకడలపై మా పోరాటం ఆగదు’’ అంటూ అంబటి రాంబాబు హెచ్చరించారు.


