మీకు ఊడిగం చేయకపోతే కక్ష సాధింపా?: వైఎస్‌ జగన్‌ | YS Jagan Fires On Chandrababu Govt At Rentapalla | Sakshi
Sakshi News home page

మీకు ఊడిగం చేయకపోతే కక్ష సాధింపా?: వైఎస్‌ జగన్‌

Jun 19 2025 5:06 AM | Updated on Jun 19 2025 6:41 AM

YS Jagan Fires On Chandrababu Govt At Rentapalla

పల్నాడు జిల్లా రెంటపాళ్లలో భారీ జనసందోహానికి అభివాదం చేస్తున్న వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

పోలీస్‌ రాజ్యంలో ప్రజా సైన్యం 

పచ్చ మీడియా ద్వారా ట్రోలింగ్‌లు, పోలీసులను అడ్డుపెట్టుకుని తప్పుడు కేసులు 

పల్నాడు జిల్లా రెంటపాళ్లలో చంద్రబాబుపై నిప్పులు చెరిగిన మాజీ సీఎం వైఎస్‌ జగన్‌

రాష్ట్రంలో పోలింగ్‌ రోజు నుంచే రెడ్‌బుక్‌ రాజ్యాంగం  

దాని ఫలితంగానే నాగమల్లేశ్వరరావు ఆత్మహత్య 

ఏడాది కాలంగా శోక సముద్రంలో కుటుంబం 

దీనికి సీఎం చంద్రబాబు ఏం సమాధానం చెబుతారు? 

వైఎస్సార్‌సీపీలో కమ్మ కులస్తులు ఉండటం తప్పా? 

ఏం పాపం చేశారని వారందరినీ వేధిస్తున్నారు? 

కేవలం మీకు ఊడిగం చేయడానికే కమ్మ వాళ్లు పుట్టారా?  

ఈ ప్రభుత్వం ఎల్లకాలం ఉండబోదన్నది వాస్తవం  

ఇప్పుడు తప్పు చేస్తున్న కొందరు పోలీసు అధికారుల తీరు హేయం 

మళ్లీ మా ప్రభుత్వం రాగానే వారిని బోనులో నిలబెడతాం

ఈ రోజు చంద్రబాబుకు వత్తాసు పలుకుతున్న పోలీస్‌ శాఖలో ఉన్న కొందరు.. అందరూ కాదు.. కొందరికి మాత్రమే ప్రత్యేకంగా చెబుతున్నా. చూస్తూ చూస్తూ ఇప్పటికే ఏడాది గడిచిపోయింది. మరో మూడు నాలుగేళ్లలో మా ప్రభుత్వం ఏర్పడుతుంది. మా ప్రభుత్వం వచ్చాక ఒక్కొక్కరికీ సినిమా చూపిస్తాం. ఎందుకంటే నాగమల్లేశ్వరరావు కుటుంబానికి చేసిన అన్యాయమే రెడ్‌బుక్‌ కారణంగా ప్రతి గ్రామంలోనూ కనిపిస్తోంది. ప్రతి గ్రామంలో కనిపిస్తున్న అన్యాయాలను చూసి, ఒకటే చెబుతున్నా. ఈ అన్యాయాల్లో మీరు భాగస్వాములు కావొద్దు. మీరు వాటిలో భాగస్వాములైతే చంద్రబాబుతో పాటు మిమ్మల్ని కూడా కచ్చితంగా బోను ఎక్కించే కార్యక్రమం చేస్తానని హెచ్చరిస్తున్నా.   
– వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

ఏమయ్యా చంద్రబాబూ.. కమ్మవారు మా పార్టీలో ఉంటే నీకు అభ్యంతరమా? కమ్మవారు పుట్టింది కేవలం మీకు ఊడిగం చేయడానికేనా?  చంద్రబాబు అన్యాయాలను ఎవరైనా వ్యతిరేకిస్తే, ప్రశ్నిస్తే.. వారిని వెంటాడి వెంటాడి, హింసించి జైల్లో పెట్టడం, దొంగ కేసులు బనాయించడం, దొంగ సాక్ష్యాలు సృష్టించడం.. పచ్చ మీడియా ద్వారా ట్రోలింగ్‌ చేయడం.. చివరకు వారంతట వారు ప్రాణాలు తీసుకునేలా అవమానించడం. ఇలా చేయడం కేవలం చంద్రబాబుకు మాత్రమే చెల్లు. ఏం పాపం చేశాడని నాగమల్లేశ్వరరావును చంపారు? ఏం పాపం చేశాడని ఆత్మహత్యాయత్నం చేసుకునేలా లక్ష్మీనారాయణను ప్రేరేపించారు? ఏం పాపం చేశారని మా పార్టీలో ఉన్న కమ్మ వారిపై తప్పుడు కేసులు పెట్టారు?

సాక్షి ప్రతినిధి, గుంటూరు: రాష్ట్రంలో పోలింగ్‌ రోజు నుంచే దారుణ పరిస్థితులు నెలకొన్నాయని, సంక్షే­మాభివృద్ధి అన్నది పక్కకుపోయి రెడ్‌బుక్‌ రాజ్యాంగం ద్వారా కక్ష సాధింపు మాత్రమే కనిపిస్తోందని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిప్పులు చెరిగారు. పోలింగ్‌ రోజు నుంచే రెడ్‌బుక్‌ రూల్‌ అమలవుతోందని చెప్ప­డా­నికి నాగమల్లేశ్వరరావు ఆత్మహత్యే నిదర్శనమ­న్నారు. 

వైఎస్సార్‌సీపీలో కమ్మ కులస్తులు ఉండటం తప్పా? ఏం పాపం చేశారని వైఎస్సార్‌సీపీలోని కమ్మ నేతలను వేధిస్తు­న్నారని ముఖ్యమంత్రి చంద్ర­బాబును ప్రశ్నించారు. కమ్మవాళ్లు పుట్టింది మీకు ఊడిగం చేయడా­నికా అని నిలదీశారు. ఈ ప్రభుత్వం ఎల్లకాలం ఉండబోదని, ఇప్పుడు తప్పు చేస్తున్న అధికారులందరికీ తమ ప్రభుత్వం వచ్చాక సినిమా చూపిస్తా­మని స్పష్టంచేశారు. 

పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం రెంటపాళ్లలో గత ఏడాది ఎన్నికల ఫలితాల తర్వాత అధికార పార్టీ నేతలు, పోలీసుల వేధింపులతో ఆత్మహత్య చేసుకున్న ఉప సర్పంచ్‌ కొర్లకుంట నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని బుధ­వా­రం ఆయన పరామర్శించారు. గ్రామంలో ఏర్పాటు చేసిన నాగమల్లేశ్వరరావు విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం మీడియాతో మాట్లా­డారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. 

మీడియాతో మాట్లాడుతున్న వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 

రౌడీషీట్‌ ఓపెన్‌ చేస్తామని బెదిరింపులు
నా పక్కనే ఉన్న వెంకటేశ్వర్లు అన్న (కొర్లకుంట వెంక­టేశ్వరరావు) సత్తెనపల్లి మండలం రెంటపాళ్లలో మా పార్టీ నాయకుడు. ఈయన కొడుకు నాగమ­ల్లేశ్వరరావు ఈ గ్రామానికి ఉప సర్పంచ్‌. పోలింగ్‌కు ముందు టీడీపీ నేతలు వారికి అనుకూలమైన అధికారులందరికీ పోస్టింగులు ఇప్పించుకున్నారు. 

పోలింగ్‌ సమయంలో ఈ ప్రాంత ఐజీ, ఎస్పీ, సీఐలు అందరూ కూడా తెలుగుదేశం పార్టీని, కూట­మిని గెలిపించడం కోసం ఎలాంటి అన్యాయాలు చేశారన్న సంగతి ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరికీ తెలుసు. పోలింగ్‌ రోజు నుంచే రెడ్‌ బుక్‌ రాజ్యాంగం అమలు చేస్తూ తెలుగుదేశం పార్టీ ఏ రకంగా ప్రవర్తించింది అన్నది ఈ గ్రామంలో కనిపి­స్తుంది. 



2024 జూన్‌ 4న అంటే కౌంటింగ్‌ రోజున.. అల్లర్లు చేస్తారని చెప్పి తెలుగుదేశం పార్టీ, జనసేన నాయకులు తప్పుడు ఆరోపణలు చేయడంతో నాగమల్లేశ్వరరావును పోలీసులు స్టేషన్‌కు తీసుకు­పోయి సెల్‌లో వేశారు. ఎన్నికల ఫలితాలు టీడీపీకి అనుకూలంగా రావడం మొదలు కాగానే, నాగమ­ల్లేశ్వ­రరావు ఇంటిపై తెలుగుదేశం, జనసేన కార్య­కర్తలు రాళ్లు విసిరారు. 

అక్కడ పోలీస్‌ స్టేషన్‌లో నాగమల్లేశ్వరరావును సీఐ రాజేష్‌ తీవ్రంగా బెదిరించారు. ఊళ్లోకి పోవద్దని, ఊరు విడిచి పెట్టాలని, లేకపోతే రౌడీషీట్‌ ఓపెన్‌న్‌ చేయడమే కాకుండా, కాల్చి చంపుతామని హెచ్చరించాడు. జూన్‌ 4న కౌంటింగ్‌ పూర్తయినా, మర్నాడు 5వ తేదీ సాయంత్రం వరకు నాగమల్లేశ్వరరావును స్టేషన్‌లోనే ఉంచి అవమానించి, బెదిరించారు. చేయని నేరాలన్నీ మోపారు. 

ఆ రోజు రాత్రి పోలీసులు విడిచిపెట్టిన తర్వాత నాగమల్లేశ్వరరావు గుంటూరులోని తన సోదరుడి ఇంటికి వెళ్లాడు. ఆ తర్వాత తన తండ్రి వెంకటేశ్వర్లుకు ఫోన్‌చేసి, స్టేషన్‌లో పోలీసుల బెదిరింపులు, అవమానించిన తీరుతో పాటు, ఏ రకంగా కొట్టి హింసించారనేది చెప్పి, విలపించి ఆత్మహత్య చేసుకుంటున్నానని చెప్పాడు. దీంతో హుటాహుటిన గుంటూరు వెళ్లిన వెంకటేశ్వర్లు, కొడుకు నాగమల్లేశ్వరరావును ఆస్ప­త్రిలో చేర్పించగా, చికిత్స పొందుతూ జూన్‌ 9న చనిపోయాడు.

దీనికి బాధ్యులెవరు?
నాగమల్లేశ్వరరావుకు భార్య, చిన్న పాప ఉన్నారు. వారికి ఏం సమాధానం చెబుతారని చంద్రబాబును అడుగుతున్నా. మీ పార్టీకి అనుకూలంగా లేరన్న ఒకే ఒక్క కారణంతో కుల ప్రస్తావన తీసుకొచ్చి అవమా­నించి, బెదిరించి, తిట్టి, కొట్టి ఒక మనిషి చావుకు కారణం అయ్యారు. ఏడాది గడిచింది. ఈ మొత్తం కుటుంబం ఇవాళ్టికి కూడా శోకంలోనే ఉంది. 

మరి దీనికి బాధ్యులెవరు? వీరి ఇంటిపై రాళ్లు విసిరి, దాడి చేసిన వారిలో ఎంత మందిని అరెస్టు చేశారు? ఎంత మంది మీద కేసులు పెట్టారు? ఎంత మందికి శిక్ష విధించారు? అని అడుగుతున్నా. ఇంతగా వేధించి చంపిన ఆ సీఐ మీద ఎలాంటి యాక్షన్‌ తీసుకున్నారని చంద్రబాబును నిలదీస్తున్నా. ఇక్కడ యథేచ్ఛగా రెడ్‌బుక్‌ రాజ్యాంగం నడుస్తోంది. చివరికి వెంకటేశ్వర్లు అన్న కోర్టు ద్వారా ప్రైవేటు కంప్లయింట్‌ ఇచ్చినా పట్టించుకునే పరిస్థితి లేదు.

చావు బతుకుల్లో గుత్తా లక్ష్మీనారాయణ 
ఇదే సత్తెనపల్లి నియోజకవర్గంలో ఈ మధ్యకాలంలో రాజుపాలెం మండలం పెదనెమలిపురికి చెందిన గుత్తా లక్ష్మీనారాయణ ఆస్పత్రిలో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న పరిస్థితి. రెండు నెలల క్రితం ఆయనపై తప్పుడు అభియోగాలు మోపి స్టేషన్‌కు పిలిచిన సీఐ, ఎస్‌ఐలు ఇద్దరూ భయపెట్టే ప్రయ­త్నం చేశారు. అయితే వాటన్నింటికీ ఆయన గట్టిగా సమాధానం ఇవ్వడం, తమ అభియోగాలకు ఏ ఆధారం లేకపోవడంతో లక్ష్మీనారాయణను విడిచి పెట్టారు. 

మళ్లీ రెండు నెలల తర్వాత డీఎస్పీ హను­మంతరావు ఆయన్ను స్టేషన్‌కు పిలిపించి బెదిరించారు. ఆ డీఎస్పీ ఒక కుల ఉన్మాది. ‘అసలు మీరు పోలీసు బట్టలు వేసుకున్నారా? న్యాయం, ధర్మం కోసం నిలబడి ఉన్నారా? లేక న్యాయం, ధర్మాన్ని చంపేయడం కోసం ఉన్నారా?’ అని  నేను ఆ డీఎస్పీ­ని అడుగుతున్నా. లక్ష్మీనారాయణను స్టేషన్‌­కు పిలిచిన డీఎస్పీ హనుమంతరావు తీవ్ర స్థాయిలో దుర్భాషలాడారు. ‘కమ్మ కులంలో పుట్టి వైఎస్సా­ర్‌­సీపీలో ఎలా ఉన్నావ్‌? ఎందుకు ఉన్నావ్‌?’ అంటూ కించపరుస్తూ మాట్లాడాడు. 

తప్పుడు సాక్ష్యాలతో జైలుకు పంపుతానని కూడా బెదిరించి, లెంపకా­యలు వేసి కొట్టి అవమానించాడు. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన లక్ష్మీనారాయణ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నిస్తూ.. అన్ని వివరాలు చెబుతూ సెల్ఫీ వీడియో తీశారు. ఎలాంటి పరిస్థితుల మధ్య తాను ఆత్మహత్యాయత్నం చేసుకుంటున్నాననేది పూర్తిగా వివరించారు. పోలీసు శాఖలో కొందరు ఏ రకమైన కుల ఉన్మాదంతో పని చేస్తున్నారో.. వారిని చంద్రబాబు, లోకేశ్‌ లాంటి వ్యక్తులు ఎలా నడిపిస్తున్నారనేది సూసైడ్‌ అటెంప్ట్‌ వీడియోలో స్పష్టంగా చెప్పారు.

సత్తెనపల్లిలో వైఎస్‌ జగన్‌కు ఘన స్వాగతం పలుకుతున్న అశేష జనవాహినిలో ఓ భాగం  

అసలు వారంతా ఏం పాపం చేశారు?
మా పార్టీలో ఉన్నారనే ఏకైక కారణంతో కమ్మ వారిని వేధిస్తారా? ఏం పాపం చేశారని ఇదే కమ్మ సామాజికవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే, మా పార్టీ నాయకుడు వల్లభనేని వంశీని ఇన్ని రోజుల పాటు జైల్లో పెట్టారు? ఒక కేసులో బెయిల్‌ వస్తే.. వెంటనే ఇంకో కేసు పెడతారు.. మళ్లీ జైల్లోనే పెట్టే కార్యక్రమం చేస్తారు. ఇవాల్టికి దాదాపు రెండు నెలలు దాటి పోయింది. వంశీ ఇంకా చంద్రబాబు శాడిజానికి బలవుతూ జైలులోనే మగ్గుతున్నాడు.  ఒకదాని తర్వాత మరొకటి వరుసగా తప్పుడు కేసులు పెట్టుకుంటూ వస్తున్నారు.

⇒ ఏం పాపం చేశారని మా పార్టీ మాజీ మంత్రి కొడాలి నానిని తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారు? దెందులూరు మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరిపై కేసులు మీద కేసులు పెడతున్నారు. ఇప్పటికే ఆయనపై తొమ్మిది కేసులు పెట్టారు. ఏం పాపం చేశారని దేవినేని అవినాష్‌ను వేధిస్తున్నారు? కేవలం కమ్మ సామాజికవర్గంలో పుట్టాడనా? అవినాష్, 
చంద్రబాబును వ్యతిరేకిస్తున్నాడు. చంద్రబాబుకు ఊడిగం చేయడం ఇష్టం లేదన్నాడు. ఆ ఒక్క కారణంతో అవినాష్‌పై కూడా కేసులు మీద కేసులు పెట్టి రోజూ హింసించే కార్యక్రమం చేస్తున్నారు. రోజూ కోర్టులకు పోయి బెయిల్‌ తెచ్చుకుని చంద్రబాబుతో యుద్ధం చేస్తున్నారు.

⇒ ఏం పాపం చేశారని మా పార్టీకి చెందిన ఎమ్మెల్సీ తలశిల రఘురాంపై మూడు కేసులు పెట్టారు? రఘురాం నాతో 15 ఏళ్లుగా ప్రయాణం చేస్తున్నారు. ఆయన్ను కూడా చిత్రహింసలకు గురి చేస్తున్నారు? ఇదే కమ్మ సామాజిక వర్గానికి చెందిన మా పార్టీ మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారా­యణను రాష్ట్రంలో వ్యాపారాలు చేసే పరిస్థితి లేకుండా వెళ్లగొట్టేశారు. తనను కూడా బెదిరించి, తప్పుడు సాక్ష్యాలతో, తప్పుడు కేసులు బనాయించి ఎందుకు ఇబ్బందులకు గురి చేస్తున్నారు? 

⇒ మా పార్టీకి చెందిన వినుకొండ, పెదకూరపాడు మాజీ ఎమ్మెల్యేలు బొల్లా బ్రహ్మనాయుడు, నంబూరు శంకరరావుల మీద ఎందుకు అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు? తెనాలి మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్‌ మీద అక్రమ కేసులు ఎందుకు పెట్టారు. ఆయన కాలేజీలకు చెల్లించాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు చెల్లించకపోగా కాలేజీలో తనిఖీల పేరుతో చిత్రహింసలకు గురి చేస్తున్నారు.

⇒ మా పార్టీ సానుభూతిపరుడైనందుకు ఇదే కమ్మ సామాజికవర్గానికి చెందిన సినీ నటుడు, దర్శకుడు, డైలాగు రైటర్‌ పోసాని కృష్ణమురళిని నెల రోజులపాటు జైళ్లలో నిర్బంధించి వేధించారు. అక్రమంగా 9 కేసులు బనాయించి శ్రీకాకుళం నుంచి కడప దాకా పోలీస్‌ స్టేషన్లు తిప్పుతూ ఇబ్బంది పెట్టారు. ప్రముఖ సినీ నిర్మాత దగ్గుబాటి సురేష్‌ ఏం పాపం చేశాడని ఆయనకు వైజాగ్‌లో స్టూడియో నిర్మాణం కోసం ఇచ్చిన భూములు రద్దు చేశారు?

⇒ మంగళగిరికి చెందిన రాజ్‌కుమార్‌ అనే వ్యక్తి సోషల్‌ మీడియాలో చంద్రబాబుకు వ్యతిరేకంగా, జగన్‌కు అనుకూలంగా పోస్టులు పెట్టినందుకు ఆయనతో పాటు, ఆయన భార్య పాలేటి కృష్ణవేణి మీద ఏకంగా 11 కేసులు పెట్టి నెల రోజులపాటు జైళ్లలో పెట్టి ఇబ్బంది పెట్టారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాజ్‌కుమార్‌ను దారుణంగా కొట్టి, చొక్కా విప్పించి లోకేశ్‌ ఫొటో ముందు మోకాళ్లపై కూర్చోబెట్టి, దండం పెట్టించి ప్రాధేయపడేలా చేశారు. ఏం పాపం చేశాడని సోషల్‌ మీడియా కార్యకర్త ఇంటూరి రవికిరణ్‌ మీద 19 తప్పుడు కేసులు పెట్టి నెలల తరబడి స్టేషన్ల చుట్టూ తిప్పారు?

మీ తీరు రాక్షసుల ప్రవర్తన కన్నా హీనం
⇒ ఏమయ్యా చంద్రబాబూ.. నువ్వు, నీకు తోడు ఒక ఈనాడు, ఒక ఆంధ్రజ్యోతి, ఒక టీవీ5. ఒక దొంగల ముఠా రాష్ట్రాన్ని దోచుకోవడం.. దోచుకున్నది పంచుకోవడం. ఇదీ, మీరంతా చేస్తున్న పని. మీరు దోచుకోవడానికి చంద్రబాబు సీఎంగా ఉండటం అవసరం. మీరంతా గజ దొంగల ముఠాగా ఏర్పడి దోచుకుంటుంటే మీ అన్యా­యాలను ఏ ఒక్క కమ్మవాడైనా ప్రశ్నిస్తే చాలు.. వారి మీద తప్పుడు కేసులు పెట్టి వేధించడానికి ఏ మాత్రం వెనుకాడని మీ నైజం చూస్తుంటే అసలు నువ్వు మనిషివేనా అనిపిస్తోంది.

⇒ చంద్రబాబును ప్రశ్నిస్తే కమ్మ కులంలో తప్పు పుట్టినట్టుగా వారి మీద కక్ష కట్టి సోషల్‌ మీడియాలో ట్రోలింగ్‌ చేస్తున్నారు. చంద్ర­బాబును వెనకేసుకొస్తున్న ఈటీవీ, టీవీ5, ఆంధ్రజ్యోతి, ఈనాడు, తెలుగుదేశం పార్టీకి చెందిన సోషల్‌ మీడియా మొత్తం కలిసి చంద్రబాబును వెన­కేసు­కొస్తూ.. ఆయన్ను వ్యతిరేకించిన వారి మీద బురద జల్లుతూ అప్రతిష్ట­పాలు చేస్తున్న తీరు రాక్షసుల ప్రవర్తన కన్నా హీనం కాదా?

⇒ సీఐ రాజేష్‌ మీద నాగమల్లేశ్వరరావు తండ్రి వెంకటేశ్వర్లు ప్రైవేటు కేసు వేస్తే, కోర్టు ఆదేశించినా పోలీసులు కేసు కట్టలేదు. ఇంత దారుణంగా ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేస్తూ రెడ్‌బుక్‌ రాజ్యాంగంతో పాలన చేస్తే ఈ ప్రభుత్వం నిలబడుతుందా? చంద్రబాబు పాలనలో రైతులు, చదువుకుంటున్న పిల్లలు, అక్కచెల్లెమ్మలు.. ఇలా ఎవ్వరూ సంతోషంగా లేరు. చంద్రబాబు అబద్ధాలు, మోసాలు, వెన్నుపోట్లకు అన్ని వర్గాలు బలైపోయాయి. రెడ్‌బుక్‌ రాజ్యాంగం, విచ్చలవిడి అవినీతితో రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా నాశనం అయ్యాయి. అందుకే ఈ పరిపాలన ఎక్కువ రోజులు నడవదు. దేవుడు, ప్రజలు గట్టిగా మొట్టికాయలు వేసే రోజు తొందర్లోనే వస్తుంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement