
చెన్నై: అన్నామలై యూనివర్శిటీ క్యాంపస్లో ఓ యువతిపై గతేడాది జరిగిన అత్యాచార కేసులో 39 ఏళ్ల జ్ఞానశేఖరన్ అనే వ్యక్తికి జీవితఖైదు విధిస్తూ చెన్నై మహిళా కోర్టు ఈరోజు(సోమవారం, జూన్ 2) తీర్పునిచ్చింది. జ్ఞానశేఖరన్ను దోషిగా తేల్చిన మహిళా కోర్టు.. కనీసం 30 ఏళ్ల జీవిత ఖైదు విధిస్తూ తీర్పును వెల్లడించింది.
2024లో అన్నామలై యూనివర్శిటీ క్యాంపస్లో జరిగిన అత్యాచార కేసుకు సంబంధించి గత కొన్నాళ్లుగా అధికార డీఎంకే, ప్రధాన ప్రతిపక్ష అన్నా డీఎంకేల మధ్య మాటల యుద్ధం జరుగుతూనే ఉంది. అయితే ఈ తీర్పులో ఇప్పటివరకూ నిందితుడిగా ఉన్న జ్ణానశేఖర్ను ఎట్టకేలకు దోషిగా తేల్చింది మహిళా కోర్టు. ఆధారాలు నిరూపణ కావడంతో జీవితఖైదు విధించింది.
ఈ తీర్పు తర్వాత ప్రధాన ప్రతిపక్షం అన్నా డీఎంకే.. డీఎంకే పార్టీని టార్గెట్ చేసింది. డీఎంకే మద్దతుదారుడైన జ్ఞానశేఖరన్ను కాపాడటానికి అధికార పార్టీ తన వంతు కృషి చేసిందంటూ సెటైర్లు వేసింది. ఎఫ్ఐఆర్లో ‘సర్’ అని పేర్కొనడాన్ని ఇక్కడ ఉదహరిస్తూ అన్నాడీఎంకే నేత పళనిస్వామి.. డీఎంకే ప్రెసిడెంట్, సీఎం ఎంకే స్టాలిన్పై విమర్శలు గుప్పించారు. ‘ ఇంతకాలం ‘సర్’ని ఎవరు కాపాడారు?, ఈ కేసులో జ్ఞానశేఖరన్ తప్ప ఎవరు నిందితులు కాదు. మరి ఇంతకాలం పాటు విచారణ జరపడానికి డీఎంకే ప్రభుత్వం ఎందుకు ఆలస్యం చేసింది?, కాపాడే ప్రయత్నం చేశారు. సాక్ష్యాలన్నీ బలంగా ఉండటంతో ఇంకేమీ చేయలేకపోయారు’ అంటూ పళనిస్వామి విమర్శించారు. తమ ప్రభుత్వం ఒకసారి అధికారంలోకి వస్తే అన్నింటికీ సమాధానం దొరుకుతుందని పేర్కొన్నారు.
దీనికి సీఎం స్టాలిన్ బదులిస్తూ.. ‘ మేము పారదర్శకంగా ఉన్నాం కాబట్టే.. తొందరగా తీర్పు వచ్చింది. కోర్టు కూడా ఈ కేసులో పోలీసుల సాధించిన పురోగతిని కొనియాడింది. మహిళల రక్షణ అనేది మా ప్రభుత్వానికి అత్యంత ముఖ్యం అనే విషయం గుర్తించుకోండి’ అని ట్వీట్ చేశారు.
ఇంతకీ ఈ కేసు ఏంటంటే..
గతేడాది డిసెంబర్ 23వ తేదీన జ్ఞానశేఖరన్ అన్నామలై క్యాంపస్లోకి ప్రవేశించాడు. ముందుగా ఆ బాధిత విద్యార్థిని స్నేహితురాలిపై దాడికి పాల్పడ్డాడు. ఆపై తాను టార్గెట్ చేసిన యువతిపై లైంగిక వేధింపులకు దిగడమే కాకుండా,
యూర్శివర్శిటీ సాక్షిగా అత్యాచార యత్నం చేశాడు. దీన్ని వీడియోగా చిత్రీకరించి ఆ యువతిని అక్కడే బ్లాక్ మెయిల్ చేశాడు. దీనిపై యువతి ఫిర్యాదు చేయగా, డిసెండర్ 24వ తేదీన కేసు నమోదైంది. ఆరు నెలల తర్వాత వచ్చిన తీర్పులో అతనికి 30 ఏళ్ల పాటు జీవితఖైదుతో పాటు రూ, 90 వేల జరిమానా విధించింది మహిళా కోర్టు. రోడ్డు పక్కన బిర్యానీలు అమ్ముకునే జ్ఞానశేఖరన్పై సుదీర్ఘమైన క్రిమినల్ రికార్డు కూడా ఉన్నట్లు పోలీస్ దర్యాప్తులో తేలింది.