సందేశ్‌ఖాలీ ఘటన .. విపక్షాలపై దుమ్మెత్తిపోసిన దీదీ | West Bengal CM Mamata Banerjee to visit Sandeshkhali | Sakshi
Sakshi News home page

సందేశ్‌ఖాలీ ఘటన .. విపక్షాలపై దుమ్మెత్తిపోసిన దీదీ

Dec 30 2024 5:10 PM | Updated on Dec 30 2024 5:41 PM

West Bengal CM Mamata Banerjee to visit Sandeshkhali

కోల్‌కతా : బీజేపీ,ఇతర ప్రతిపక్ష పార్టీలపై పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ (mamata banerjee) దుమ్మెత్తి పోశారు. సందేశ్‌ఖాలీపై తప్పుడు కథనాల్ని ప్రచారం చేసేందుకు పెద్దమొత్తంలో నిధుల్ని ఖర్చు చేశారని ఆరోపించారు.

పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రం సందేశ్‌ఖాలీలో తృణమూల్‌ కాంగ్రెస్‌(trinamool congress)కు చెందిన నేతలు అక్కడి మహిళలపై లైంగిక దాడులకు పాల్పడడమే కాకుండా వారి భూములు కబ్జా చేశారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ తరుణంలో సోమవారం తొలిసారి మమతా బెనర్జీ సందేశ్‌ఖాలీలో పర్యటించారు.

ఈ సందర్భంగా దీదీ మాట్లాడుతూ..‘నిందితుల్ని ప్రోత్సహించవద్దు. నకిలీ వార్తలను వ్యాప్తి చేసేలా ఇక్కడ (సందేశ్‌ఖాలీ) పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు చేశారని నాకు తెలుసు. కానీ దాని గురించి నేను పెద్దగా మాట్లడదలుచుకోలేదు. అబద్ధానికి అందం ఎక్కువ. నిజానికి సహనం తక్కువ. ఆ అందమైన అబద్ధాన్ని ఎక్కువ కాలం ఉండనివ్వదు. నిజం ఎప్పటికైనా వెలుగులోకి వస్తుంది’ అని అన్నారు.   

ఈ ఏడాది ప్రారంభంలో దీదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సందేశ్‌ఖాలీ (sandeshkhali) స్థానికులు ఆందోళన చేపట్టారు. ఈ ఆందోళనలు ప్రభుత్వాన్ని ఇరకాటంలోకి నెట్టాయి. అయినప్పటికీ తాజా పర్యటనలో ఆ ఆందోళనల్ని ప్రస్తావించలేదు. పరోక్షంగా వాటిని నేను ఎప్పుడో మరిచి పోయా. ఇక్కడి మహిళలు మోసగాళ్లను నమ్మకండి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలపాలని మిమ్మల్ని ఎవరైనా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తారేమో అలాంటి వారిపట్ల తస్మాత్‌ జాగ్రత్త అంటూ హెచ్చరించారు.

సందేశ్‌ఖాలీలో లోక్‌సభ ఎన్నికల ప్రచారం నిర్వహించా. ప్రచారంలో ఎన్నికల ఫలితాల తర్వాత సందేశ్‌ ఖాలీని పర్యటిస్తారా? అని స్థానికులు నన్ను ప్రశ్నించారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత పర్యటనకు వస్తానని మాట ఇచ్చా. మాట ప్రకారం మీ ముందుకు వచ్చా. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో స్థానికులు ప్రయోజనం పొందుతున్నారా? లేదా? ఏదైనా సమస్యలు ఉంటే వాటిని ఇప్పుడే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. సందేశ్‌ఖాలీ ప్రాంత మహిళలు, పురుషులు ప్రపంచంలో నెంబర్‌వన్‌గా ఉండాలని నేను కోరుకుంటున్నాను’అంటూ మమతా బెనర్జీ ఆకాంక్షించారు.

సందేశ్‌ఖాలీ వివాదం ఏంటి?
పశ్చిమబెంగాల్‌లోని సందేశ్‌ఖాలీ అనే ప్రాంతంలో టీఎంసీ నేత షాజహాన్‌ షేక్‌, అతని అనుచరులు తమపై లైంగిక దాడులు చేసేందుకు, తమ భూములు  లాక్కోవడానికి ప్రయత్నిస్తున్నారని అక్కడి మహిళలు ఈ ఏడాది ప్రారంభంలో ఆందోళన చేపట్టారు. మహిళల ఉద్యమానికి కేంద్ర బిందువుగా మారింది. ఆ ఆందోళనల నేపథ్యంలో షాజహాన్‌ఖాన్‌ ఇంటిపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) దాడులు కూడా జరిపింది. దాడులు జరుపుతున్న సమయంలో​ షాజహాన్‌ఖాన్‌ మనుషులు ఈడీ సిబ్బందిపై దాడి చేసి వారి వాహనాలను ధ్వంసం చేశారు. ఈ ఘటన జరిగినప్పటి నుంచి షాజహాన్‌ఖాన్‌ పరారీలో ఉన్నాడు. కొద్ది రోజులకే షాజహాన్‌ఖాన్‌ను అరెస్ట్‌ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement