
సాక్షి, నెల్లూరు: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఘాటైన వ్యాఖ్యలు చేశారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కలిగించడం వల్ల కలిగే ప్రయోజం ఏంటని ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ఆయన.. ఉచితాలను అలవాటు చేయకూడదంటూ మాట్లాడారు.
‘‘ప్రభుత్వాలు విద్యా, వైద్యంపై ఖర్చు చేయాలి. అంతేకానీ ఉచితాలు అలవాటు చేయకూడదు. విద్య వల్ల పేదవాడు సంపన్నులయ్యే అవకాశాలు ఉన్నాయి. వైద్యం ప్రతి మనిషికి అవసరమైనది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని శ్వేత పత్రం రూపంలో ప్రజలకు తెలియపరచాలి. ఐదేళ్లలో అప్పులు ఎంత చేస్తున్నారు., ఎంత తిరిగి చెల్లిస్తున్నారు అన్నది ప్రకటించాలి.
.. అసెంబ్లీలో బూతుల సాంప్రదాయానికి తెర వేయాలి. సభలో లేని వారి పట్ల అమర్యాదగా వ్యవహరించకూడదు. అటువంటి వ్యాఖ్యలు చేసే వారిని సస్పెండ్ చేయాలి. ఎమ్మెల్యేలకు, ఎంపీలకు సభలో ఎలా నడుచుకొవాలో ట్రైనింగ్ ఇవ్వాలి. పార్టీ ఫిరాయిస్తే చర్యలు తీసుకోవాలి
.. న్యాయస్థానాలు ప్రజా ప్రతినిధులపై కేసులను రెండు సంవత్సరాలలో తీర్పులు ప్రకటించాలి. కోర్టులు తక్కువైతే, జడ్జిలు తక్కువ సంఖ్యలో ఉంటే వెంటనే ఆ సమస్యను పరిష్కరించుకోవాలి అని నెల్లూరులో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన వ్యాఖ్యలు చేశారు.
